సోషల్ మీడియాలో నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. ఇటీవలి కాలంలో ఆన్లైన్ వేదికలపై తప్పుదారి పట్టించే సలహాలు, తప్పుడు వార్తలు, అప్రామాణిక సమాచారంతో ప్రజలు మోసపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా అధికారిక సంస్థలు వెల్లడించాయి.
సున్నితమైన అంశాలపై మాట్లాడే లేదా సలహాలు ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్లు ఇకపై తప్పనిసరిగా వృత్తిపరమైన అర్హతలు కలిగి ఉండాలని చైనా సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సిఎసి) ప్రకటించింది. కొత్త చట్టం ప్రకారం, ఆరోగ్యం, విద్య, చట్టం, ఆర్థికం వంటి సున్నితమైన విషయాలపై సోషల్ మీడియాలో పోస్టులు చేయాలంటే, ఆ వ్యక్తికి సంబంధిత డిగ్రీ, లైసెన్స్ లేదా సర్టిఫికేట్ ఉండాలి.
ఉదాహరణకు, వైద్య సలహాలు ఇవ్వాలంటే వైద్యుడిగా గుర్తింపు పొందిన రిజిస్ట్రేషన్ ఉండాలి. చట్టపరమైన అంశాలపై వ్యాఖ్యానించాలంటే న్యాయవాది లేదా చట్ట నిపుణుడిగా అర్హత అవసరం. అదే విధంగా విద్యా లేదా ఆర్థిక రంగాల్లో మాట్లాడే వ్యక్తులు తమ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ను చూపించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
ఇకపై అర్హతలేని వ్యక్తులు సున్నితమైన అంశాలపై సోషల్ మీడియా వేదికల్లో సలహాలు ఇవ్వడం, వీడియోలు పోస్ట్ చేయడం నేరంగా పరిగణించబడుతుంది. ప్రజలను తప్పుదోవ పట్టించే సలహాల నుంచి కాపాడటమే తమ లక్ష్యమని చైనా సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఏసీ) స్పష్టం చేసింది.ఈ నిబంధనల అమలు బాధ్యతను డౌయిన్ (టిక్టాక్ చైనా వెర్షన్), వీబో వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపైనే ఉంచారు. క్రియేటర్ల అర్హతలను, వారి పోస్టులను వెరిఫై చేయాల్సిన బాధ్యత ఈ సంస్థలదే. అంతేకాకుండా, మెడికల్ ఉత్పత్తులు, సప్లిమెంట్లను ‘ఎడ్యుకేషన్’ పేరుతో ప్రమోట్ చేయడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది.ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ కంటెంట్పై విశ్వసనీయత పెంచేందుకే ఈ నిబంధనలు తెచ్చామని అధికారులు చెబుతుండగా, ఇది డిజిటల్ సెన్సార్షిప్లో కొత్త రూపమని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
స్వతంత్ర గొంతులను అణచివేసే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని వారు విమర్శిస్తున్నారు. ‘నైపుణ్యం’ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేకపోవడం అధికారులకు అపరిమిత అధికారాలు ఇస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతమంది చైనీస్ నెటిజన్లు మాత్రం ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నారు. దీనివల్ల ఆన్లైన్ చర్చలకు మరింత విశ్వసనీయత వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

More Stories
త్వరలో భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం .. ట్రంప్
ప్రపంచ శాంతికి భారత్- జపాన్ సంబంధాలు కీలకం
టర్కీలో పాక్- ఆఫ్ఘన్ శాంతి చర్చలు విఫలం