ప్రపంచ శాంతికి భారత్​- జపాన్ సంబంధాలు కీలకం

ప్రపంచ శాంతికి భారత్​- జపాన్ సంబంధాలు కీలకం

భారత్​- జపాన్​ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ రంగంలో సహకార సంబంధాలను మెరుగుపర్చేందుకు దృష్టి సారిస్తామని తెలిపారు. భారత్‌-జపాన్ సంబంధాలు ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధికి కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొన్నారు. 

ఈ మేరకు జపాన్ ప్రధాని సనాయె తకాయిచితో జరిగిన సంభాషణను ఎక్స్ వేదికగా మోదీ పంచుకున్నారు. జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టిన తకాయిచకి అభినందనలు తెలియజేశారు. ‘జపాన్ ప్రధాని సనాయె తకాయిచితో ఆత్మీయ సంభాషణ జరిగింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు గానూ ఆమెకు అభినందనలు తెలియజేశాను. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాల సంబంధాలు చాలా ముఖ్యమని అంగీకరించాం’ అని మోదీ ఎక్స్​లో రాసుకొచ్చారు.

మరోవైపు ‘జపాన్​- భారత్​ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడం కోసం మీతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం’ అని సనాయె తకాయిచి పోస్ట్​ చేశారు. జపాన్​ దౌత్య, భద్రతా విధానాలకు యునైటెడ్​ స్టేట్స్​తో కూటమి మూలస్తంభమని సనాయె తకాయిచి ఎక్స్​లో పేర్కొన్నారు.  పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్‌ ప్రధాని షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. 

దీంతో లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన సనాయె తకాయిచి (64) జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా గౌరవం దక్కించుకున్నారు. దీంతో బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌కు వీరాభిమాని అయిన తకాయిచి జపాన్‌ రాజకీయాల్లో ఉక్కు మహిళగా పేరు పొందారు.  ప్రధానమంత్రిగా ఎన్నిక కావడానికి ఆమె చేసిన మూడో ప్రయత్నం సఫలం కావడం గమనార్హం. గడచిన ఐదేళ్లలో జపాన్‌ ప్రధానమంత్రిగా ఎన్నికైన నాలుగో వ్యక్తి.
లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీలో సంప్రదాయ అతివాద ధోరణికి ప్రతినిధిగా ప్రసిద్ధురాలైన తకాయిచి మాజీ ప్రధాని షింజో అబె అనుయాయి.  మందగమనంలో ఉన్న జపాన్‌ ఆర్థిక రంగాన్ని పునరుద్ధరించడం ప్రధానమంత్రిగా ఆమె ముందున్న అతిపెద్ద సవాలు అని చెప్పవచ్చు. అయితే పురుషాధిక్య రాజకీయాలకు ప్రసిద్ధిగాంచిన జపాన్‌ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక మహిళ ప్రధానమంత్రిగా ఎన్నికవడం విశేషం.