హైదరాబాద్ శివారులోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో, నగరంలో సంచరించే నిరాదరణకు గురైన గోవులకు ఆశ్రయం కల్పించే లక్ష్యంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కి చెందిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్ జి సి ఎల్ తెలంగాణలోనే అతిపెద్ద, ఆధునిక గోశాల నిర్మాణంకు శ్రీకారం చుట్టింది.
రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం ఎన్కెపల్లి గ్రామ పరిధిలో ఈ గోశాలను వంద ఎకరాల సువిశాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 157 కోట్లతో పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హెచ్ఎండీఏ అధికారులు పనులను వేగవంతం చేశారు.
గోశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఇటీవల పూర్తిస్థాయిలో సర్వే చేసి, హద్దులు నిర్ణయించి, హెచ్ఎండీఏకు అధికారికంగా అప్పగించారు. ప్రస్తుతం అధికారులు భూమి చుట్టూ ఫెన్సింగ్ను ఏర్పాటు చేసి తదుపరి టెండర్ ప్రక్రియను చేపట్టారు. టెండర్ల ప్రక్రియ పూర్తవ్వగానే వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
ఈ వంద ఎకరాల ప్రభుత్వ భూమి గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉండడంతో సుమారు 40 కుటుంబాలు దీనిపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో గోశాల ఏర్పాటుకు వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు హెచ్ఎండీఏ మానవతా దృక్పథంతో వారికి తగిన హామీలను ఇచ్చింది.
గోశాల ఏర్పాటు చేసే స్థలంలోనే నిరాశ్రయులైన ఆ 40 కుటుంబాలకు ఒక్కొక్కరికి 300 చదరపు గజాల స్థలాన్ని కేటాయించడానికి అంగీకరించింది. అంతేకాకుండా ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ఔట్ సోర్సింగ్ కింద ఈ గోశాలలోనే ఉద్యోగం కల్పించి, వారికి జీవనోపాధి కల్పించే హామీ ఇచ్చారు. అధికారుల ఈ సానుకూల చర్యతో ఆ కుటుంబాలు సంతృప్తి చెంది, భూమిని హెచ్ఎండీఏకు అప్పగించారు.
ఈ మెగా గోశాల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నగరంలో ఆవుల సంరక్షణ మెరుగుపడటంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది గోవులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆశ్రయం లభించనుంది.

More Stories
బీహార్ ఎన్నికల ప్రచారం నుండి రేవంత్ తొలగింపు!
జర్నలిస్టులకు విరాహత్ అలీ క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ గెలిస్తే రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్