దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు

దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు

గుర్తింపు లేని ఒక యూనివర్శిటీ ‘చట్టబద్ధమైన’ ఇంజనీరింగ్‌ కళాశాలగా ప్రకటించుకోవడంపై యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) ఆదివారం మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల, ఢిల్లీలోని కోట్లా ముబారక్‌పూర్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజనీరింగ్‌కి అనుమతి లేదని యుజిసి పేర్కొంది. ఆ యూనివర్సిటీ అనుమతులు లేని డిగ్రీ కోర్సులను నిర్వహిస్తోందని పేర్కొంది. ఆ సంస్థ జారీచేసే డిగ్రీలకు ఎలాంటి విలువ లేదని తెలిపింది.

అసలు ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు సంబంధించిన ఏ చట్టాలకు లోబడి ప్రారంభించలేదని యూజీసీ స్పష్టం చేసింది. విద్యార్థులు ఈ కళాశాలలో చేరవద్దని హెచ్చరికలు జారీ చేసింది.  యుజిసి చట్టం, 1956లోని సెక్షన్‌ 22ని ఉల్లంఘించి అనుమతి లేని డిగ్రీ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోందని తెలిపింది. ఈ సంస్థ ఏకేంద్రం లేదా రాష్ట్ర చట్టాల కింద స్థాపించబడలేదని, సెక్షన్‌ 2(ఎఫ్‌) లేదా 3 కింద గుర్తింపు పొందలేదని, ఈ సంస్థ ఇచ్చే డిగ్రీలు చెల్లవని యుజిసి స్పష్టం చేసింది.

యుజిసి డేటా ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అత్యధికంగా ఢిల్లీలో 9 యూనివర్శిటీలు ఉండగా, యుపిలో ఐదు, ఉన్నాయి. మిగిలినవి ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పుదుచ్చేరిల్లో ఉన్నట్లు యుజిసి గణాంకాలు తెలిపాయి. ఢిల్లీలోని విద్యార్థులను బ్రోకర్‌ నెట్‌వర్క్‌లతో మాయచేసి ఈ విశ్వవిద్యాలయాలు ఆకర్షిస్తున్నాయి.

తమ సంస్థలకు పేర్లు పెట్టే సమయంలో ‘నేషనల్‌’, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌, ఇన్‌స్టిట్యూట్‌ వంటి పదాలు వాడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యాపథ్‌, పరిషద్‌, ఓపెన్‌ యూనివర్సిటీ వంటి పదాలను వినియోగిస్తున్నారని తెలిపింది. ఏదైనా సంస్థలో చేరే సమయంలో దాని పేరు సెక్షన్‌ 2(ఎఫ్‌) లేదా 3 కింద యుజిసి గుర్తించిన జాబితాలో ఉందో లేదో చెక్‌ చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. ఇక ఏఐసీటీఈ, పీసీఐ, ఎన్‌ఎంసీ వంటి కౌన్సిల్స్‌ నుంచి ఆయా సంస్థల్లో ఏ కోర్సుల నిర్వహణకు అనుమతులు లభించాయో సరిచూసుకోవాలని హెచ్చరించింది.