ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలకు రూ.2.5 కోట్లతో ఫెలోషిప్

ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలకు రూ.2.5 కోట్లతో ఫెలోషిప్

అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దూసుకుపోతున్న భారత్ పరిశోధన, నూతన ఆవిష్కరణల్లోనూ అదే జోరును కొనసాగించేందుకు యోచిస్తోంది. దేశంలోని సంస్థల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఆవిష్కర్తలను ఆకర్షించడానికి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ఇండియా రీఇమాజిన్డ్ ఫెలోషిప్‌ పేరుతో ఉపకారవేతనాన్ని ప్రారంభించింది. 

బ్లాక్‌చెయిన్ ఫర్ ఇంపాక్ట్ (బిఎఫ్ఐ) ఆధ్వర్యంలో మొదలైన ఈ అంతర్జాతీయ కార్యక్రమం ద్వారా బయోమెడికల్ సైన్స్, ప్రజారోగ్య సవాళ్లను పరిష్కరించగలిగే నిపుణులను భారత్‌కు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఫెలోషిప్‌లో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు మూడేళ్ల కాలానికి గాను 3 లక్షల డాలర్లు అంటే సుమారు రూ. 2.5 కోట్లు గ్రాంట్‌ను అందిస్తారు. 

భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్థల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న భారతీయ లేదా అంతర్జాతీయ పరిశోధకులకు, పారిశ్రామికవేత్తలకు, వైద్య నిపుణులకు, ఆవిష్కర్తలకు ఈ అవకాశం దక్కుతుంది. ఈ ఫెలోషిప్‌కు వ్యక్తిగతంగా ఎవరికి వారు దరఖాస్తు చేసుకునే వీలు లేదు. కేవలం పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఈ ఫెలోషిప్‌కు తమ అభ్యర్థుల పేర్లను నామినేట్ చేస్తూ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

దీనివల్ల అభ్యర్థులకు ఆయా సంస్థల మద్దతు లభించడంతో పాటు, జవాబుదారీతనం కూడా పెంపొందుతుంది.  ఈ విధానం ద్వారా కేవలం ముగ్గురు అత్యుత్తమ నిపుణులను మాత్రమే ఎంపిక చేయాలని బీఎఫ్ఐ నిర్ణయించింది. ఎంపికైన ప్రతి ఫెలోకు నిధులు మూడు దఫాలుగా, ప్రతి సంవత్సరం లక్ష డాలర్లు అంటే సుమారు రూ. 88 లక్షలు చొప్పున విడుదల చేస్తారు.

 అయితే ఈ మొత్తాన్ని వ్యక్తిగత పరిశోధకులకు కాకుండా వారిని హోస్ట్ చేసే భారతీయ సంస్థలకు నేరుగా అందజేస్తారు. ఈ నిధులు ప్రాజెక్ట్ అమలు, ప్రయోగశాల ఖర్చులు, జీతాలు, ప్రయాణాలు, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగపడతాయి.  ఫెలోలను హోస్ట్ చేయడానికి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఆమోదం పొందిన సంస్థలు మాత్రమే అర్హులు. 

హోస్ట్‌ సంస్థలు ప్రాజెక్టు కోసం ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసి నిధులు కొనసాగాలంటే తప్పనిసరిగా వార్షిక పురోగతిని, ఆర్థిక నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. నిధుల విడుదలకు ఒక పటిష్టమైన సమీక్షా విధానం ఉంటుంది. పరిశోధనా ఫలితాలు, మైలురాళ్లు, ప్రచురణల ఆధారంగా నిపుణుల కమిటీలు సమీక్షించి నిధులను విడుదల చేస్తాయి. 

చివరి విడత నిధులు మాత్రం నిపుణుల కమిటీ సమీక్షించి, పూర్తి స్థాయి నివేదిక సమర్పించిన తర్వాతే విడుదలవుతాయి.  2026 జనవరి 31 తేదీని దరఖాస్తుకు తుది గడువుగా నిర్ణయించారు. ఈ లోపు హోస్ట్ సంస్థ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి రెజ్యూమె, రీసెర్చ్ ప్రపోజల్, రికమెండేషన్ లెటర్స్, ఇన్‌స్టిట్యూషనల్ కమిట్‌మెంట్ లెటర్స్ అన్ని జత చేసి india.reimagined@blockchainforimpact.nl కు ఈమెయిల్ చేయాలి.