అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు

అమెరికా గుప్పిట్లో పాక్ అణ్వాయుధాలు
 
* బిలియన్ల డాలర్లతో ముషారఫ్ ను కొనుగోలు ..మాజీ సిఐఏ అధికారి
 
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు అమెరికాతో ఉన్న సంబంధాలపై మాజీ సీఐఏ అధికారి జాన్ కిరియాకౌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా బిలియన్ల డాలర్ల సహాయంతో ముషారఫ్‌ను కొనుగోలు చేసిందని వెల్లడించారు. అంతేకాకుండా పాకిస్తాన్ అణ్వాయుధాల నియంత్రణను కూడా అమెరికాకు అప్పగించారని ఆయన ఆరోపించారు.

మిలిటరీ, ఆర్థిక అభివృద్ధి సహాయం రూపంలో కోట్లాది డాలర్లను పాకిస్తాన్‌కు అప్పట్లో అమెరికా ఇచ్చినట్లు జాన్ కిరియాకౌ వెల్లడించారు. ముషారఫ్‌తో వారానికి చాలాసార్లు సమావేశమై అమెరికాకు కావలసిన ప్రతిదాన్ని చేయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా గురించి జాన్ కిరియాకౌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
నియంతలతో పనిచేయడానికి అమెరికా ఇష్టపడుతుందని, ఎందుకంటే అప్పుడు ప్రజాభిప్రాయం గురించి లేదా మీడియా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. 
2002లో తాను పాకిస్తాన్‌లో పనిచేస్తున్నప్పుడు దేశ అణ్వాయుధాల నియంత్రణ అమెరికన్ రక్షణ విభాగం పెంటగాన్ చేతిలో ఉందని అనధికారికంగా తనకు చెప్పినట్లు కిరియాకౌ వెల్లడించారు.  ఉగ్రవాదుల చేతిలోకి అణ్వాయుధాలు చిక్కుతాయనే భయంతో ముషారఫ్ స్వయంగా ఆ అణ్వాయుధాల నియంత్రణను అమెరికాకు అప్పగించినట్లు తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ అణుబాంబు పితామహుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ (ఏక్యూ ఖాన్)పై చర్యలు తీసుకోకుండా అమెరికా వెనుకడుగు వేయడానికి సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుందని కిరియాకౌ కీలక విషయాలు వెల్లడించారు.

ఇజ్రాయెల్ తరహా విధానాన్ని అనుసరించి ఉంటే తాము ఏక్యూ ఖాన్‌ను సులభంగా చంపేసే వాళ్లమని పేర్కొన్నారు. కానీ సౌదీ ప్రభుత్వం జోక్యం చేసుకుని  దయచేసి అతన్ని వదిలేయాలని, తాము ఏక్యూ ఖాన్‌తో కలిసి పనిచేస్తున్నామని, తాము పాకిస్తాన్‌కు దగ్గరగా ఉన్నామని కోరినట్లు తెలిపారు. ఆ దౌత్య ఒత్తిడికి అమెరికా తలొగ్గిందని వివరించారు. ఏక్యూ ఖాన్‌ను ఎదుర్కోకపోవడం అమెరికా ప్రభుత్వపు అతి పెద్ద తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు.

2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని అమెరికా భావించిందని కిరియాకౌ పేర్కొన్నారు. అయితే భారత్ దాడులకు దిగకపోవడాన్ని సీఐఏలో వ్యూహాత్మక సహనం అని పిలిచేవాళ్లమని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌పై దాడులు చేయడానికి భారత ప్రభుత్వం అన్ని విధాలా అర్హత కలిగి ఉందని, కానీ చేయలేదని పేర్కొన్నారు. 
 
వైట్‌హౌస్‌లో ఉన్నవారు కూడా భారతీయులు చాలా పరిణతి చెందిన విదేశాంగ విధానాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పుకున్నట్లు తెలిపారు. ఈ సహనమే భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం లాంటి ప్రమాదాన్ని నివారించిందని కిరియాకౌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యూహాత్మక సహనాన్ని బలహీనతగా భావించే ప్రమాదం ఉందని, అందుకే భారత్ స్పందించాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.
 
ముషారఫ్ అమెరికాతో ఉగ్రవాద నిరోధక చర్యల్లో సహకరిస్తున్నట్లు నటిస్తూనే భారత్‌కు వ్యతిరేకంగా సైనిక వర్గాలను, మితవాద గ్రూపులను సంతృప్తి పరచడానికి ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించారని కిరియాకౌ ఆరోపించారు. పాక్ సైన్యానికి అల్ ఖైదా గురించి పట్టదని, వారికి భారత్ గురించే ఆలోచించేదని తెలిపారు. అందుకే వారికి సంతోషం కలిగించడానికి ఉగ్రవాదాన్ని కొనసాగించేందుకు ముషారఫ్ అనుమతించారని కిరియాకౌ సంచలన విషయాలు వెల్లడించారు.