శబరిమల బంగారం బళ్లారి నగల వ్యాపారికి విక్రయం

శబరిమల బంగారం బళ్లారి నగల వ్యాపారికి విక్రయం
శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు తాపడాల కేసులో బంగారు తాపడాల నుంచి వేరు చేసిన స్వర్ణాన్ని బళ్లారిలోని నగల వ్యాపారి గోవర్ధన్‌కు విక్రయించినట్లు సిట్ విచారణలో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి తన వాంగ్మూలంలో వెల్లడించాడు. ఈ విషయంపై విచారణ జరిపించడం కోసం నగల వ్యాపారి గోవర్ధన్‌ను సిట్ తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి పిలిపించింది. 
 
ఆ విచారణలో ఉన్నికృష్ణన్ పొట్టి దేవస్థానానికి చెందిన బంగారాన్ని తనకు విక్రయించాడని గోవర్ధన్ అంగీకరించడంతో కనిపించకుండా పోయిన దాదాపు 476 గ్రాముల బంగారాన్ని తిరిగి రికవరీ చేయాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది. అమ్మిన బంగారాన్ని తిరిగి పొందడానికి సిట్ బృందం, ఉన్నికృష్ణన్ పొట్టిని బెంగళూరుకు తీసుకెళ్లింది.

ఇదిలా ఉండగా ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న దేవస్వం మాజీ పరిపాలన అధికారి బి.మురారి బాబు, 2019లో దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్న సమయంలో బంగారానికి బదులు రాగి అని నమోదు చేసినట్లు సిట్ గుర్తించింది. తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో సిట్ బృందం ఆయన్ను విచారించగా, ఉద్దేశపూర్వకంగా తాను అలా చేసినట్లు మురారి బాబు అంగీకరించాడు. దీంతో ఆయన్ను రన్నీ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు.

1998లో విగ్రహాలకు బంగారు పూత పూసినట్లు మురారి బాబుకు ముందే తెలుసునని దర్యాప్తు బృందం తమ నివేదికలో పేర్కొంది. అంతేకాదు మురారి బాబు బంగారు రేకులను అక్రమంగా రవాణా చేయడంలో ఉన్నికృష్ణన్ పొట్టికి సహాయం చేశాడని సిట్  భావిస్తోంది.  బంగారు రేకులను రాగిగా నమోదు చేసి, దాదాపు రెండు కిలోల బంగారాన్ని కొట్టేయాలనే మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇది చేశారని సిట్ బృందం అనుమానిస్తోంది. అయితే చంగనస్సేరిలో ఉన్న తన నివాసంలో బుధవారం రాత్రి మురారిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

ప్రత్యేక దర్యాప్తు బృందానికి బాధ్యత వహిస్తున్న ఏడీజీపీ హెచ్.వెంకటేష్ ఆయన్ను విచారించారు. 2019లో శబరిమల నుంచి బంగారు రేకుల అక్రమ రవాణాకు దోహదపడ్డారనే ఆరోపణలతో పాటు, ఇతర కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా దేవస్థానం డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న బి. మురారి బాబును ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఇటీవలే సస్పెండ్ చేసింది.