వందల మొబైల్‌ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?

వందల మొబైల్‌ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?

బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురవడంతో 19 మంది సజీవ దహనంకు గురవడంతో అంతులేని విషాదాన్ని మిగిల్చింది.  ఈ ఘటనలో 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అధికారులు చేస్తున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందల మొబైల్‌ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్‌ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి.

వారు తెలిపిన వివరాల ప్రకారం ముందుగా బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టగానే దాని ఆయిల్‌ ట్యాంక్‌ మూత ఊడిపడి అందులోని పెట్రోల్‌ కారడం మొదలైంది.  అదే సమయంలో బస్సు కింది భాగంలో ద్విచక్రవాహనం ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో నిప్పు రవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్‌ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి.

బస్సు లగేజీ క్యాబిన్‌లో వందల సంఖ్యలో మొబైల్‌ ఫోన్లు ఉన్నట్లు గుర్తించారు.రూ.46 లక్షలు విలువైన దాదాపు 234 మొబైల్‌ ఫోన్లతో కూడిన పార్సిల్‌ ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా మొబైల్‌ ఫోన్ల పైభాగం ప్లాస్టిక్‌తో తయారు చేసినప్పటిక బ్యాటరీలు మాత్రం లిథియంతో తయారు చేస్తారు. అవి అధిక వేడికి పేలుతాయి.  ఆ మంటలు లగేజీ క్యాబిన్‌ నుంచి పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయని దీంతో వారు తప్పించుకునే ఛాన్స్‌ లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. 

కర్నూలు ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్‌ ఫోన్లే కారణమని ప్రాథమికంగా తేలింది. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది.  అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్‌ బృందాలు గుర్తించాయి.

లగేజీ క్యాబిన్‌లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. దీంతో డ్రైవర్‌ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోరు నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు.  అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.

మరోవంక, బైక్‌ను కావేరీ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టలేదని వెల్లడైంది. వర్షంలో బైక్‌పై వెళుతున్న శంకర్‌, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.  చిన్నటేకూరు దగ్గర బైక్‌ స్కిడ్‌ అయ్యి కిందపడ్డ యువకులు రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌ రోడ్డు మీద చెరో వైపు పడిపోయిన శంకర్‌, ఎర్రిస్వామి. డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్‌ తలకు బలమైన గాయాలై స్పాట్‌లోనే మృతి చెందగా,  ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత వేగంగా బైక్‌పై నుంచి వెళ్లిన వీ కావేరి ట్రావెల్స్‌ బస్సు సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను ఈడ్చుకెళ్ళింది.