ప్రపంచంలోనే అత్యధికంగా వాయుకాలుష్యంకు పేరొందిన రాజధాని నగరాలలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. వర్షాకాలం, ఎండాకాలం కాస్త తక్కువగా ఉన్నా అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ నెల మొత్తం ఢిల్లీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇదే సమయంలో దీపావళి పండుగ రావడం, టపాసులు పేల్చడంతో పాటు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో రైతులు పంటల వ్యర్థాలను తగలబెట్టడం వంటివి చేస్తుంటారు.
ఇలా ఓవైపు పొగమంచు, మరోవైపు వాయు కాలుష్యంతో అక్కడి ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి నడుస్తుండగా వీటికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యంగా గాలి నాణ్యతను పెంచడానికి దేశ రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించేందుకు రంగం సిద్ధం చేసింది. వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తొలిసారిగా నగరంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైంది.
ఈ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎక్స్ వేదికగా ప్రకటించారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29వ తేదీనే ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను చేస్తామని చెప్పారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో ఢిల్లీ ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నందున 29న ప్రయోగానికి అనుకూల పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా పిలుస్తారు.
ఈ విధానంలో శాస్త్రవేత్తలు ముందుగా వర్షం కురిపించడానికి అనుకూలంగా ఉండే మేఘాలను గుర్తిస్తారు. ఆ మేఘాల్లో సరిపడా తేమ ఉన్నప్పటికీ వర్షపు బిందువులు ఏర్పడేందుకు సరైన కేంద్రకాలు లేని పక్షంలో ఈ ప్రక్రియను చేపడతారు. అంటే సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ వంటి రసాయన ఉత్ప్రేరకాలను విమానాలు లేదా హెలికాప్టర్ల ద్వారా మేఘాల మీదకు చల్లుతారు.
ఈ రసాయనాలు మేఘాల్లోని తేమతో కలిసి వర్షపు బిందువులు ఏర్పడేందుకు సహకరిస్తాయి. కొన్ని సందర్భాల్లో పొడి మంచును కూడా ఉపయోగించి మేఘాలు చల్లబడేలా చేసి వర్షం కురిసేలా చేస్తారు. ఈ ప్రయోగం విజయవంతం కావాలంటే వాతావరణంలో తగినంత తేమ ఉండాలి. అలాగే గాలి వేగం అనుకూలంగా ఉండటం కూడా చాలా అవసరం. ఇదంతా జరిగి కృత్రిమ వర్షం కురవడం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి, కాలుష్య కణాలు కింద పడిపోతాయి. ఫలితంగా పరిసరాలు, పర్యావరణం శుభ్రంగా మారుతుంది. అందుకే సర్కారు ఈ కృత్రిమ వర్షాన్ని కురిపించాలని చూస్తోంది.

More Stories
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు
సంతాప తీర్మానంలో విమర్శలపై బిజెపి అభ్యంతరం