లవ్​ జిహాద్​కు వ్యతిరేకంగా అస్సాంలో నూతన బిల్లు

లవ్​ జిహాద్​కు వ్యతిరేకంగా అస్సాంలో నూతన బిల్లు
అసోంలోని బీజేపీ ప్రభుత్వం లవ్​ జిహాద్​కు వ్యతిరేకంగా నూతన బిల్లును తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బుధవారం నాగోన్​లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, దీంతో పాటు అనేక చారిత్రక కొత్త బిల్లలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. 

తేయాకు కార్మికులకు భూమి హక్కులు ఇచ్చే బిల్లుపైనా చర్చించనున్నట్లు చెప్పారు. బిల్లు డ్రాఫ్ట్​లను కేబినెట్ ఆమోదించిన తర్వాత​ అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. “ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చారిత్రక బిల్లులను ప్రవేశపెట్టనున్నాం. లవ్​ జిహాద్​, బహుభార్యత్వం, సత్రాల రక్షణ లాంటి కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాం. ఈ బిల్లులను సభలో పెట్టి చర్చిస్తాం. డ్రాఫ్ట్ బిల్లులకు కేబినెట్​ ఆమోదం తెలిపాక మీడియాకు వివరిస్తాం” అని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. 

అట్టడుగు వర్గాలకు న్యాయం, సాధికారతను నిర్ధారిస్తూ, అస్సాం సామాజిక,  సాంస్కృతిక నిర్మాణాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చొరవలో భాగంగా ప్రతిపాదిత బిల్లులను ఆయన అభివర్ణించారు. లవ్ జిహాద్, బహుభార్యత్వం వంటి వాటిని అడ్డుకునేందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా, వచ్చే నెలలో అసోం శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

బటద్రవ సత్రం పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించడానికిడిసెంబర్​ లేదా జనవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అసోంలో పర్యటిస్తారని పేర్కొన్నారు. లవ్​ జిహాద్​కు పాల్పడిన వారికి జీవిత ఖైదు విధించే చట్టాలను తీసుకువస్తున్నట్లు గతేడాది సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.  బలవంతపు మత మార్పిళ్ల ద్వారా వివాహం చేసుకోవడాన్ని అడ్డుకునేందుకు చట్టాలు అవసరమని అభిప్రాయపడ్డారు.  కాగా ఇప్పటికే బహుభార్యత్వంపై అసోం ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఇది సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొంది. కొన్ని మతాలు రెండో పెళ్లికి అనుమతి ఇస్తాయని, అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని వివరించింది.  అంతకుముందు చట్ట వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసుకున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంది అసోం ప్రభుత్వం. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దాదాపు 3వేల మందికి పైగా అరెస్టు చేసింది.

అంతకుముందు కూడా స్థానిక ప్రజల రక్షణ దృష్ట్యా అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లో అభద్రతతో జీవిస్తున్న స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  ముప్పు ఉన్న, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ను సమీక్షించిన అనంతరం రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు.