జమ్మూ కాశ్మీర్ కు తగిన సమయంలో రాష్ట్ర హోదా

జమ్మూ కాశ్మీర్ కు తగిన సమయంలో రాష్ట్ర హోదా
జమ్మూకశ్మీర్ కు తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంత ప్రజలు లేవనెత్తిన డిమాండ్లకు మంచి పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన అమిత్ షా, జమ్మూ కశ్మీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆర్టికల్ 370 రద్దు తర్వాత, ఉగ్రవాద ప్రభావిత జమ్మూకశ్మీర్ మంచి మలుపు తీసుకుంది. గత తొమ్మిది నెలల్లో ఒక్క స్థానిక వ్యక్తి కూడా ఉగ్రవాద గ్రూప్ లలో చేరలేదు. 1990ల నుంచి వేర్పాటువాదం చెలరేగుతూ ఉన్న జమ్మూకశ్మీర్లో చూసిన గుణాత్మక మార్పు ఇది” అని తెలిపారు. 

“గతంలో పాకిస్థాన్ మన సరిహద్దుల్లోకి వారి ఉగ్రవాదులను పంపాల్సిన అవసరం లేదని భావించేది. పాక్ మన పిల్లల చేతుల్లో ఆయుధాలు ఉంచి, మనకే వ్యతిరేకంగా పనిచేసేలా చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూకశ్మీర్ ప్రజలు తాము భారతదేశం మొత్తానికి చెందిన వారమని, దేశం మొత్తం తమదని భావిస్తున్నారు” అని అమిత్ షా చెప్పారు. 

ఇప్పుడు జమ్మూకశ్మీర్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిందని, ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్, శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయని, రాజ్యసభ ఎన్నికలు కూడా కొంతకాలం తర్వాత జరుగుతాయని ఆయన వెల్లడించారు.  ప్రమాణ స్వీకారం చేసి ఏడాది గడిచినా రాష్ట్ర హోదా పునరుద్ధరించకపోవడంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై కూడా అమిత్ షా స్పందించారు.

“అతను (ఒమర్ అబ్దుల్లా) రాజకీయపరమైన ఒత్తిడి వల్ల అలా చెబుతుండవచ్చు. కానీ జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా తగిన సమయంలో పునరుద్ధరించబడుతుంది. అది కూడా అతనితో చర్చల తర్వాతనే జరుగుతుంది” అని అమిత్ షా స్పష్టం చేశారు. మరోవైపు లద్ధాక్ లో ఇటీవల జరిగిన ఆందోళనల గురించి అమిత్ షా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం “లేహ్, కార్గిల్ కమిటీలతో చర్చలు” జరుపుతోందని భరోసా ఇచ్చారు. “ప్రజలు కాస్త ఓపికగా ఉండాలని మేము కోరుతున్నాం. వారి న్యాయమైన డిమాండ్లు అన్నింటికీ మంచి పరిష్కారం లభిస్తుంది” అని హామీ ఇచ్చారు. 

లద్ధాక్ రాజకీయ, పౌర సమాజాలకు ప్రాతినిధ్యం వహించే లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ సంయుక్త నాయకత్వంను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు నిరసనకారులు లేహ్ లో బీజీపీ కార్యాలయాన్ని తగలబెట్టడం, కొన్ని ఇతర ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయడం లాంటి పనులు చేశారు. వారిని సోనమ్ వాంగ్చుక్ రెచ్చగొట్టారని పేర్కొంటూ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

దీని గురించి కేంద్ర హోంమంత్రిని ప్రశ్నించగా, “ప్రజల డిమాండ్ల గురించి నేను మాట్లాడగలను. కానీ వ్యక్తి గురించి మాట్లాడలేను. వాంగ్చుక్ కేసు ప్రస్తుతం కోర్టు ముందు ఉంది. ఆధారాల ఆధారంగా న్యాయస్థానం తగిన నిర్ణయం తీసుకుంటుంది” అని తెలిపారు.  “గిరిజన ప్రాంతాలను బలవంతంగా అభివృద్ధికి దూరం చేయడం పాపం” అని ఆల్ట్రా-వామపక్ష భావజాలాన్ని అమిత్షా దుయ్యబట్టారు. 

ప్రభుత్వం మావోయిస్టు తిరుగుబాటును కచ్చితంగా అణచివేస్తుందని స్పష్టం చేశారు. “ప్రధాని మోదీ అధికారంలో ఉన్న 11 ఏళ్లలో మేము కనీసం 600 మావోయిస్టు శిబిరాలను కూల్చేశాం. వాటి ఆర్థిక వనరులను నాశనం చేశాం. వారికి ఆయుధాలు చేరకుండా చేశాం. 2026 డిసెంబర్ 31 నాటికి మావోయిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం” అని అమిత్షా పేర్కొన్నారు.