
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టాయి. ఈ బంద్కు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.
దీంతో ఉదయం 4గంటలకే బంద్ మొదలైంది. ఆర్డీసీ డిపోల ముందు బస్సులు బయటకు రాకుండా జేఏసీలు నాయకులు బైఠాయించారు. దీంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. డిపోల ఎదటు బీసీ సంఘాలతో నేతలతో పాటు అన్ని పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇక హైదరాబాద్లో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు.
మరోవైపు దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారులంతా బంద్కు స్వచ్ఛందంగా తమ మద్దతును తెలిపారు. రాష్ట్రంలో విద్యా సంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాల వారు బంద్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలించవద్దని సూచించారు. అవాంఛనీయ ఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బంద్ కారణంగా ఇవాళ ఉస్మానియా వర్సిటీ పరిధిలో జరగనున్న పరీక్షలు వాయిదా పడ్డాయి. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ఓయూ రిజిస్ట్రార్ తెలిపారు. కాగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్న బంద్ ఇదే.
బీసీ బంద్ నేపథ్యంలో జూబ్లీ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బిసి రిజర్వేషన్లు అమలు కావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. అన్నీ తెలిసి కూడా బిసిలను సిఎం రేవంత్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
బిసిలు 52 శాతం ఉంటే 42 శాతమని కాకి లెక్కలు చెబుతున్నారని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. తాను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. మరోవైపు దీపావళి పండుగతో పాటు వారాంతపు సెలవులు ఉండడంతో వివిధ జిల్లాలకు వెళ్లాల్సిన ప్రయాణికులతో బస్టాండ్ లలో రద్దీ పెరిగింది. ముందస్తు సమాచారం లేకపోవడంతో బస్ స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
More Stories
ప్రభుత్వ పథకాలకు ఓట్ల జాబితాను వాడుకున్న కేసీఆర్
పొంగులేటి- సురేఖ వ్యవహారంలో చీలిపోయిన రేవంత్ మంత్రివర్గం
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారుకు చుక్కెదురు