అనిల్‌ అంబానీ సహాయకుడు అశోక్‌ కుమార్‌ అరెస్ట్

అనిల్‌ అంబానీ సహాయకుడు అశోక్‌ కుమార్‌ అరెస్ట్

అనిల్‌ అంబానీ సహాయకుడు, రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ పాల్‌ను ఈడి అదుపులోకి తీసుకుంది. రూ.63 కోట్ల నకిలీ బాంక్‌ గ్యారెంటీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. 

అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌కి చెందిన ఆర్థిక దర్యాప్తులో భాగంగా అరెస్ట్‌ జరిగిందని పేర్కొన్నాయి. ఈ వారం మార్కెట్లలో రిలయన్స్‌ షేర్లు పడిపోయాయని ఆ వర్గాలు  వెల్లడించాయి. కొన్ని గంటల పాటు కొనసాగిన విచారణ అనంతరం బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న పాల్‌ను ఢిల్లీలోని ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టు ఎదుట హాజరుపరిచి రెండు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు ఇడి తెలిపింది. 

అక్టోబర్‌ 18 వరకు తదుపరి రిమాండ్‌పై కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్‌ చేసింది. గత నవంబర్‌లో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఇఒడబ్ల్యు) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా, ఈడి మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు దర్యాప్తు చేస్తోంది. రిలయన్స్‌ పవర్‌ అనుబంధ సంస్థ బ్యాటరీ నిల్వ టెండర్‌ను పొందేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఇసిఐ)కి నకిలీ బ్యాంక్‌ గ్యారెంటీని సమర్పించిందని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. 

ఫస్ట్‌ర్యాండ్‌ బ్యాంక్‌, మనీలా జారీ చేసినట్లు చెప్పిన హామీ నకిలీదని, ఆ బ్యాంకుకు ఫిలిప్పీన్స్‌లో బ్రాంచ్‌ లేదని ఈడి తెలిపింది. టెలిగ్రామ్‌, వాట్సాప్‌ వంటి ప్రామాణికం కాని కమ్యూనికేషన్‌ మార్గాలతో ఎస్‌ఇసిఐకి సమర్పించిన పత్రాలను సులభతరం చేయడంలో, ఆమోదించడంలో పాల్‌ కీలక పాత్ర పోషించడాని ఈడి తెలిపింది.