రెడ్లు బిసి మంత్రి సురేఖను అణచే కుట్ర… కుమార్తె ఆరోపణ

రెడ్లు బిసి మంత్రి సురేఖను అణచే కుట్ర… కుమార్తె ఆరోపణ
* మేడారం జాతర పనులు దేవాదాయ శాఖ నుండి ఆర్&బికి బదిలీ

“బీసీ మంత్రి అయిన మా అమ్మ కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. రెడ్లందరూ కలిసి మా కుటుంభాని టార్గెట్ చేశారు” అంటూ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ ను అరెస్ట్ చేసేందుకు బుధవారం రాత్రి తమ  ఇంటికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఆమె కుమార్తె సుస్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి సురేఖను, తండ్రి కొండా మురళిని వేధించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు.

“మా ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చిండ్రు. ఎందుకొచ్చిండ్రని అడిగితే సుమంత్‌పై చాలా అభియోగాలున్నయని చెప్పిండ్రు. ఏమేం ఫిర్యాదులున్నాయో మాకు లిస్ట్‌ ఇవ్వండి అన్నం. ఆయన మా స్టాఫ్‌ కదా అని అడిగినం. వాళ్లు ఏం చెప్పకుండా వెళ్లిపోయిండ్రు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాం టి పరిస్థితి ఫేస్‌ చేస్తున్నందుకు చాలా సిగ్గుగా ఉన్నది” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

“బీసీ లేడీ అని కూడా చూడకుండా ఇలా చేయడం సిగ్గుచేటు. ఓఎస్డీని తొలగించినప్పుడు కనీసం అడగలేదు. అడిగి వాళ్ల ఇజ్జత్‌ ఎందుకు తీయాలని మేం కూడా అడగలేదు. కానీ ఈ రోజు వాళ్ల ఇజ్జత్‌ను వాళ్లే తీసుకున్నరు” అంటూ సుస్మిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు బుధవారం రాత్రి సురేఖ ఇంటికి మఫ్టీలో వెళ్లిన పోలీసులను అమె అడ్డుకున్నారు. 

అనంతరం సుష్మిత మీడియాతో మాట్లాడుతూ “దేవాదాయ శాఖలో ఒక టెండర్‌ పడింది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండా మంత్రి పొంగులేటి తనకు కావాల్సిన వారికి ఇచ్చుకున్నరు. మావాళ్లు కూడా టెండర్‌ వేసిండ్రు. బిడ్‌ ఓపెన్‌ చేస్తే అది మా వాళ్లకు వచ్చింది. పొంగులేటి ఫోన్‌ చేసి టెండర్‌ విత్‌ డ్రా చేసుకోవాలని మా అమ్మను కోరిండ్రు. విత్‌డ్రా చేసుకోబోమని అమ్మ చెప్పారు. దీంతో ఆ టెండర్‌ రెవెన్యూ శాఖకు వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ టెండర్‌ రీకాల్‌ చేస్తున్నరు” అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

అయితే తన నియోజకవర్గం హుజూర్‌నగర్‌ పరిధిలో ఉన్న డెక్కన్‌ సిమెంట్స్‌ కంపెనీ ప్రతినిధులను సుమంత్‌ రివాల్వర్‌తో బెదిరించారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారని, ఆ కారణంతోనే మాజీ ఓఎస్డీ అరెస్టుకు రంగం సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. “డెక్కన్‌ సిమెంట్‌తో ఇష్యూ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సుమంత్‌ ఎక్స్‌టార్షన్‌ చేశారంటున్నారు. రోహిన్‌రెడ్డికి తెలియాలి. రేవంత్‌రెడ్డికి తెలియాలి. రోహిన్‌రెడ్డిని మేం కలవలేదు. సీఎంవో ఆఫీసు నుంచి రోహిన్‌రెడ్డి వచ్చి సుమంత్‌కు కాల్‌ చేస్తే రోహిన్‌రెడ్డి ఆఫీసుకు సుమంత్‌ వెళ్లారు. కావాలంటే కెమెరాలు చెక్‌ చేసుకోవచ్చు” అని సుష్మిత సవాల్ చేశారు.

రోహిన్ రెడ్డి కార్యాలయంలో, ఆయన సమక్షంలోనే డెక్కన్ సిమెంట్ వారితో సుమంత్ మాట్లాడాడని చెబుతూ, బెదిరిస్తే రోహన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలపై కూడా కేసు పెట్టాలి గదా? అని ఆమె ప్రశ్నించారు.  “డెక్కన్‌ సిమెంట్‌ విషయంలో వచ్చామని, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కంప్లయింట్‌ చేశారని పోలీసులు చెప్తున్నరు. ఉత్తమ్‌కు కాల్‌ చేస్తే నేను కంప్లయింట్‌ చేయలేదని చెప్పారు” అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు. 
 
 “రాహుల్‌ గాంధీ బీసీ నినాదం ఎత్తుకుంటే ఇక్కడ బీసీలను తొక్కాలని చూస్తున్నారు. మేం కింది నుంచి పైకి వచ్చినోళ్లం. రెడ్లందరూ ఒక్కటై మమ్మల్ని తొక్కాలని చూస్తున్నరు.  సీఎం సోదరులకు గన్‌మన్‌లతో భద్రత కల్పించినప్పుడు మాకెందుకివ్వరు? మమ్మల్ని హత్య చేయించేందుకేనా?” అంటూ సుస్మిత  ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవంక, మేడారం జాతర నిర్వహణ పనులను రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. దేవదాయశాఖకు ఈ పనులను పర్యవేక్షించేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం లేదని ప్రభుత్వం పేర్కొనడం ద్వారా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జోక్యం లేకుండా నివారించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టం అయింది.