ఢిల్లీలో గ్రీన్ క్రాక‌ర్స్ కు సుప్రీంకోర్టు అనుమ‌తి

ఢిల్లీలో గ్రీన్ క్రాక‌ర్స్ కు సుప్రీంకోర్టు అనుమ‌తి

ఢిల్లీ సహా దేశ రాజధాని ప్రాంతాల్లో హరిత బాణాసంచా అమ్మకాలతో పాటు వాటిని కాల్చుకోవడానికి సుప్రీం కోర్టు అనుమతిచ్చింది. బాణాసంచా తయారీ, అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని దాఖలైన పలు పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అక్టోబర్‌ 18నుంచి 21వరకు మాత్రమే గ్రీన్‌క్రాకర్ల వినియోగానికి అనుమతిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 10గంటల లోపే వాటిని కాల్చాలని నిర్దేశించింది.

ఆన్‌లైన్‌లో ఎట్టి పరిస్థితుల్లో బాణాసంచా అమ్మకాలు జరగకూడదని స్పష్టం చేసింది.  సాధారణ పటాకుల అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం అందిందని, దాని వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుని హరిత బాణాసంచా వినియోగానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఇన్ని రోజులు హరిత పటాకులపై నిషేధం ఉన్నా వాయు నాణ్యతలో పెద్ద తేడా కనిపించలేదని వెల్లడించింది. 

అనుమతించిన క్యూఆర్​ కోడ్లను కలిగి ఉన్న పటాకులను మాత్రమే అమ్మేలా నిరంతరం నిఘా ఉంచాలని పోలీసులకు సూచించింది. ఈ సమయంలో కాలుష్య నియంత్రణ సంస్థలు గాలి నాణ్యతా సూచీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్వాగతించారు. దీనిని దీపావళి సందర్భంగా ప్రజల మనోభావాలను గౌరవించిన తీర్పుగా అభివర్ణించారు. ఇది పర్యావరణ పరిరక్షణ పట్ల సమతుల్యతను చూపుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్​లో ఆమె పోస్ట్ చేశారు.

“ప్రత్యేక అభ్యర్థన మేరకు గ్రీన్ క్రాకర్ల వినియోగానికి అనుమతి ఇచ్చినందుకు సుప్రీం కోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఈ నిర్ణయం ప్రజల ఆధ్యాత్మిక, ఉత్సవ భావాలను గౌరవించడంతోపాటు, పర్యావరణ పరిరక్షణ పట్ల సమతుల్యతను చూపుతోంది. ప్రజల మనోభావాలను, పరిశుభ్రమైన దిల్లీ సాకారం చేయడం కోసం మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే, పండుగ ఆనందం కొనసాగేలా చూడడమే మా లక్ష్యం” అని రేఖా గుప్తా రాసుకొచ్చారు.

కొన్ని షరతుల కింద రాష్ట్రాల్లో బాణసంచా వాడకాన్ని అనుమతించవచ్చని, జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ ఆమోదించిన పర్యావరణహిత బాణసంచా మాత్రమే తయారుచేసి, విక్రయించేలా చూడాలని కోరాయి. మరోవైపు పేలుడు స్వభావమున్న టపాసులు తయారుచేయకుండా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది.