రహస్య పత్రాల లీక్‌లో భారత సంతతి రక్షణ వ్యూహకర్త అరెస్ట్

రహస్య పత్రాల లీక్‌లో భారత సంతతి రక్షణ వ్యూహకర్త అరెస్ట్
అమెరికాలో భారత సంతతికి చెందిన విదేశాంగ విధాన నిపుణుడు, రక్షణ వ్యూహకర్త యాష్లీ జె టెల్లిస్‌ అరెస్ట్‌ అయ్యారు. జాతీయ భద్రతకు సంబంధించిన పత్రాల కేసులో ఫెడరల్‌ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా ఆయన వద్ద ఉంచుకున్నారన్న ఆరోపణలు అదుపులోకి తీసుకున్నట్లు వర్జీనియా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ యూఎస్ అటార్నీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
64 ఏళ్ల ఆష్లే టెల్లిస్  వర్జీనియాలోని వియన్నాలోని తన ఇంట్లో దొరికిన వెయ్యి పేజీలకు పైగా అత్యంత రహస్య, రహస్య పత్రాలతో సహా జాతీయ రక్షణ సమాచారాన్ని చట్టవిరుద్ధంగా దాచుకున్నాడని అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఆయన అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మండలిలో పనిచేశారు. భారత్- అమెరికా సంబంధాల అంశాలలో నిపుణుడిగా పేరొందారు.
 
ఎఫ్‌బీఐ అఫిడవిట్‌లో స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు సలహాదారుగా, పెంటగాన్ ఆఫీస్ ఆఫ్ నెట్ అసెస్‌మెంట్‌తో కాంట్రాక్టర్‌గా జాబితా అయ్యారు. ఆయన వాషింగ్టన్ థింక్ ట్యాంక్ అయిన కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో సీనియర్ ఫెలో కూడా. టాటా చైర్ ఫర్ స్ట్రాటజిక్ అఫైర్స్‌గా యాష్లీ టెల్లిస్‌ సేవలు అందిస్తున్నారు.  ప్రభుత్వ రహస్య మెటీరియల్‌ నిర్వహణపై ఫెడరల్ దర్యాప్తు జరిపిన అనంతరం గత వారాంతంలో టెల్లిస్‌ను అరెస్ట్ చేసినట్లు ఫెడరల్‌ అధికారులు పేర్కొన్నారు.
రక్షణ సంబంధిత పత్రాలను అనధికారికంగా కలిగి ఉండటాన్ని నిషేధించే 18 యూఎస్సీ 793(e) చట్టాన్ని ఆయన ఉల్లంఘించారంటూ అభియోగాలు మోపారు.  ఈ కేసులో మరో కీలక కోణం వెలుగులోకి వచ్చింది. టెల్లిస్ సురక్షిత ప్రాంతాల నుంచి రహస్య పత్రాలను తొలగించారనే ఆరోపణలతో పాటు, చైనా అధికారులతో సమావేశమయ్యారనే విషయంపై కూడా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
టెల్లిస్‌ అరెస్ట్‌పై యూఎస్‌ అటార్నీ లిండ్సే హల్లిగాన్‌ సోఅబ్దు స్పందిస్తూ ఈ ఆరోపణల్లోని ప్రవర్తన పౌరుల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 
టెల్లిస్‌ ముంబయిలో జన్మించారు. సెయింట్‌ జేవియర్స్‌ కళాశాలలో చదువుకున్నారు. చికాగో విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో ఎంఏ పట్టా అందుకున్నారు. ఈ కేసులో టెల్లిస్‌పై మోపిన అభియోగాల్లో నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 2.50లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. 
 
అలాగే, స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను ప్రభుత్వం జప్తు చేసే అవకాశం సైతం ఉంది. అయితే, ప్రస్తుతం ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, కోర్టులో నేరం రుజువయ్యే వరకు టెల్లిస్‌ను నిర్దోషిగానే పరిగణించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.