
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుండగా కర్ణాటక కాంగ్రెస్ లో మాత్రం ఈ సంస్థపై నిషేధం విధించాలని ఓ మంత్రి డిమాండ్ చేయడం దుమారం రేపుతోంది. ఈ విషయమై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్యనే కాకుండా కాంగ్రెస్ నేతల మధ్య కూడా మరో రాజకీయ మాటల యుద్ధానికి కారణం అయింది.
ఆర్ఎస్ఎస్ చేస్తున్న కార్యకలాపాలపై నిషేధం వేయాలంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక సీనియర్ మంత్రి ప్రియాంక్ ఖర్గే తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాయడం తీవ్ర చర్చకు దారితీసింది. అదే సమయంలో మరికొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే రకమైన వినతులను కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్కు అందించారు.
వీటిని పరిశీలించాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. ఇక అధికార పార్టీ తీరుపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కర్ణాటకలోని ప్రభుత్వ స్థలాలు, స్కూల్ గ్రౌండ్లు, దేవాలయాల ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈనెల 4వ తేదీన లేఖ రాయడం కన్నడ రాజకీయాల్లో కలకలం సృష్టించింది.
ఎలాంటి పోలీస్ అనుమతులు లేకుండా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఖర్గే పేర్కొన్నారు. స్కూల్ గ్రౌండ్లు, దేవాలయాల ప్రాంగణాలు వంటి ప్రభుత్వ ఆస్తులను ఆర్ఎస్ఎస్ తన శాఖల కోసం వాడుకుంటోందని పేర్కొన్నారు. భారత సమైక్యతకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ శాఖల్లో నినాదాలు చేస్తున్నారని, పిల్లలు, యువత మనస్సుల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా భావాలను నింపుతున్నారని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు.
ఆర్ఎస్ఎస్ ఇచ్చే లాఠీ శిక్షణ.. పిల్లలు, యువకులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రియాంక్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ పై
ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా సొంత పార్టీలోనే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ వంటి సీనియర్ నేతలు ప్రియాంక్ ఖర్గే చేసిన డిమాండ్ను సమర్థిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ అయిన సంస్థ అయితే దానికి సంబంధించిన పత్రాలు చూపించాలని డిమాండ్ చేశారు.
అయితే, మరికొందరు మాత్రం ఆరెస్సెస్కు మద్దతు పలుకుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని మరోసారి ఇరకాటంలో పడేశాయి. ఆర్ఎస్ఎస్ తనదైన శైలిలో సేవలను అందించే చరిత్ర కలిగిన సంస్థ అని,ఎ వరికీ ఇబ్బంది కలిగించకుండా సేవలు చేస్తోందని ప్రశంసలు గుప్పించడం గమనార్హం. ఇప్పటికే ఈ ఏడాది ఆగుస్ట్ లో కర్ణాటక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలోనే శివకుమార్ ఆర్ఎస్ఎస్ ప్రార్ధనను ఆలపించడం అప్పట్లో పెను దుమారం రేపింది.
కాగా, ఆర్ఎస్ఎస్ పై ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రికి లేఖ రాయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర అభివర్ణించారు. ఇలాంటి జిమ్మిక్కులతో ముఖ్యమంత్రి పదవికి దగ్గర కావచ్చని ప్రియాంక్ ఖర్గే భ్రమ పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో మూడు సార్లు ఆర్ఎస్ఎస్ ను నిషేధించడానికి ప్రయత్నించిందని, కానీ చివరికి నిషేధాన్ని ఎత్తివేసి, 1963 యుద్ధంలో ఆరెస్సెస్ సేవలను గుర్తించి గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఆహ్వానించిందనే విషయాన్ని ఈ సందర్భంగ విజయేంద్ర గుర్తు చేశారు.
“బహుశా, ఖర్గే కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చూస్తున్నారు. ఆయన గాంధీ కుటుంబాన్ని కూడా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు” అని ధ్వజమెత్తారు. “ఆర్ఎస్ఎస్ శాఖల నుండి యువకులు, వృద్ధులు ప్రతిధ్వనించే ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు వినేవారిని భయపెట్టినట్లు కనిపిస్తున్నాయి!” అంటూ మండిపడ్డారు. ఖర్గే చేస్తున్న డిమాండ్ కాంగ్రెస్ అనుసరిస్తున్న మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలకు కొనసాగింపు అని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక ఆరోపించారు.
More Stories
ఐసిస్ ఉగ్రవాదులను ఆఫ్ఘన్ నుండి పూర్తిగా తుడిచిపెట్టాం!
కేరళలో మంత్రిపదవిపై సురేష్ గోపి, బీజేపీల సంధిగ్ధత
హరియాణా డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం