భారత్, అఫ్గాన్ ఉమ్మడి ప్రకటనపై పాక్ అక్కసు

భారత్, అఫ్గాన్ ఉమ్మడి ప్రకటనపై పాక్ అక్కసు

భారత్​ అఫ్గానిస్థాన్‌ విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్​లో అప్గాన్​ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. భారత్​ పర్యటనలో భాగంగా అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌ ఖాన్ ముత్తాఖీ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జమ్ముకశ్మీర్​ గురించి చేసిన సూచనలకు సంబంధించి పాకిస్థాన్ సందేశాలను తెలియజేసినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

“జమ్ముకశ్మీర్​ను భారత్​లో భాగంగా పేర్కొనడం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుంది. ఉగ్రవాదాన్ని నియంత్రించే బాధ్యతను పాకిస్థాన్​పై మోపడం వల్ల ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కాపాడే బాధ్యత నుంచి అఫ్గన్ ఆఫ్ఘన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని తప్పించుకోవడం సాధ్యంకాదు” అంటూ పాకిస్తాన్ ఆక్రోశం వెళ్లగక్కింది. 

“గత నాలుగు దశాబ్దాలుగా దాదాపు నలుగురు మిలియన్ల అఫ్గన్ పౌరులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు అఫ్గానిస్థాన్​లో శాంతి నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్​లో అనధికారికంగా నివసిస్తున్న అప్గాన్ పౌరులు తిరిగి తమ దేశానికి వెళ్లాలి. ఇతర అన్ని దేశాల మాదిరిగానే, తమ భూభాగంలో ఉన్న విదేశీ పౌరుల నివాసాన్ని నియంత్రించే హక్కు పాకిస్థాన్​కు కూడా ఉంది” అని విదేశాంగ కార్యాలయం పేర్కొంది.

ఇక రెండు దేశాల మధ్య సామాజిక,ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు వాణిజ్యం, ఆర్థిక, అనుసంధాన సదుపాయాలను పాకిస్థాన్​  విస్తరించిందని పేర్కొంది. అయితే, పాకిస్థాన్ తన పౌరుల భద్రతను కాపాడే బాధ్యత కలిగి ఉందని చెప్పింది. పాకిస్థాన్​కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తన భూభాగాన్ని ఉపయోగించకుండా అప్గాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు విదేశాంగ కార్యాలయం నొక్కి చెప్పింది.

దాయాది దేశం పాకిస్థాన్​తో ఘర్షణల వేళ అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ గురువారం భారత్‌ పర్యటనకు వచ్చారు. అక్టోబర్ 10న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్​తో భేటీ అయ్యి, వివరణాత్మక చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఇరువురు మంత్రులు   అభివృద్ధి సహకార ప్రాజెక్టులలో, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ప్రజా మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లో అఫ్గాన్​కు భారత్ సహకారంపై మాట్లాడుకున్నారు. మరోవైపు, పర్యటకులపై పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు, అలాగే భారత ప్రజలు, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినందుకు అఫ్గాన్​కు కృతజ్ఞతలు తెలియజేశారు జైశంకర్. 

ఈ క్రమంలో భారత్‌పై ఉగ్రవాద దాడులు లేదా భారత వ్యతిరేక దాడులకు తమ భూభాగాన్ని ఎప్పటికీ అనుమతించబోమని ముత్తాఖీ స్పష్టం చేశారు. భారత్‌ను మిత్రదేశంగా భావిస్తామని, పరస్పర గౌరవం, వాణిజ్యం, ప్రజా సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదం పాకిస్థాన్​ అంతర్గత సమస్య అని ముత్తాఖీ చేసిన వ్యాఖ్యలను ఇస్లామాబాద్ కూడా తోసిపుచ్చింది.