`ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ పొరపాటు.. ఇందిరను కోల్పోవాల్సి వచ్చింది

`ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ పొరపాటు.. ఇందిరను కోల్పోవాల్సి వచ్చింది
 
1984లో అమృత్‌ సర్‌లోని స్వర్ణ దేవాలయం నుంచి ఉగ్రవాదులను తరిమికొట్టడానికి చేపట్టిన ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ సరైన మార్గం కాదని కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం స్పష్టం చేశారు. ఆ ఆపరేషన్‌ కారణంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.  అయితే, ఈ ఆపరేషన్ సైన్యం, పోలీసులు, నిఘా వ్యవస్థ, అధికారుల సమష్ఠి నిర్ణయమని తెలిపారు. ఆపరేషన్ బ్లూ సార్​కు ఇందిరా గాంధీని మాత్రమే నిందించలేమని అన్నారు. జర్నలిస్ట్ హరీందర్ బవేజా రాసిన ‘దే విల్ షూట్ యు, మేడమ్’ అనే పుస్తకంపై చర్చ సందర్భంగా చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.

“స్వర్ణ దేవాలయాన్ని తిరిగి పొందడానికి ఎంచుకున్నది తప్పుడు మార్గం. మూడు నాలుగేళ్ల తరువాత సైన్యాన్ని దూరంగా ఉంచడం ద్వారా స్వర్ణ దేవాలయాన్ని తిరిగి పొందడానికి మేము సరైన మార్గాన్ని చూపించాం. ఉగ్రవాదులను స్వర్ణ దేవాలయం నుంచి తరిమికొట్టడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టడం తప్పుడు పద్ధతి. ఆ తప్పునకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తన ప్రాణాలను బలిగొన్నారు” అని గుర్తు చేశారు.

మరోవైపు కాంగ్రెస్​ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధిష్ఠానం అసహనం వ్యక్తం చేసింది. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు సీనియర్​ నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలని, పార్టీకి అప్రతిష్ట వచ్చేలా మాట్లాడకూడదని తెలిపింది. ముఖ్యంగా చాలా మందికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

పంజాబ్‌లో కొందరు స్వతంత్ర దేశం కావాలంటూ చేపట్టిన ఆందోళన ఖలిస్థాన్‌ ఉద్యమానికి కారణమైంది. 1980లో ఈ ఉద్యమం వివాదాస్పద నేత జర్నయిల్‌ సింగ్‌ భింద్రన్‌ వాలే ఆధ్వర్యంలో కొనసాగింది. ఇదే సమయంలో సిక్కుల పవిత్ర స్థలమైన అమృత్‌ సర్‌ లోని స్వర్ణ దేవాలయాన్ని భింద్రన్‌ వాలే స్థావరంగా మార్చుకుని ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాడు. తన అనుచరులతో గోల్డెన్ టెంపుల్ నుంచే పోలీసులపై దాడులు చేయించాడు. 

దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత సైన్యంతో సంప్రదింపులు జరిపి స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఖలిస్థాన్‌ వేర్పాటువాదులను నిర్బంధించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ 1984 జూన్‌ 1న సైనిక చర్య ప్రారంభించింది. భారత సైన్యం వేర్పాటువాది భింద్రన్‌ వాలేతోపాటు స్వర్ణ దేవాలయంలో దాక్కున్న వారిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించింది.

అయితే అక్కడి నుంచి భారీ ఆయుధాలు, రాకెట్‌ లాంచర్లతో సైన్యంపై దాడులు జరిగాయి. ఊహించని పరిణామంతో ఆర్మీ ఎదురుదాడులకు దిగింది. ఇలా జూన్‌ 1న మొదలైన ఆపరేషన్‌ బ్లూ సార్ జున్ 8వరకు కొనసాగింది.  ఈ క్రమంలో భింద్రన్‌ వాలేతో పాటు ఇతర ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ ఆపరేషన్‌లో 83 మంది భారత సైనికులు అమరులయ్యారు. మరో 236 మంది క్షతగాత్రులయ్యారు.

అయితే, ఈ ఆపరేషన్‌ జరిగిన నాలుగు నెలలకే (1984 అక్టోబర్‌ 31న) ఇద్దరు సిక్కు బాడీగార్డులు ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేశారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు సిక్కుల ఊచకోతకు దారితీశాయి. ఇందులో ఆ వర్గానికి చెందిన వేలాది మంది ప్రాణాలు విడిచారు. అయితే సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్ పార్టీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. తాజాగా ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు మార్గమని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత పి. చిదంబరం వ్యాఖ్యానించడం గమనార్హం.