బెంగాల్‌లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

బెంగాల్‌లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

రాత్రి వేళ విధుల్లో వున్న మహిళా ట్రెయినీ డాక్టరుపై ఆర్‌జి కర్‌ ఆస్పత్రిలో అత్యాచారం, హత్య జరిగిన ఘటన మరిచిపోకముందే పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. దుర్గాపూర్‌లోని ఐక్యూ మెడికల్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న ఒరిస్సాలోని జలేశ్వర్‌కు చెందిన వైద్య విద్యార్ధినిపై అదే కళాశాల క్యాంపస్‌ వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. 

తన స్నేహితుడితో కలిసి డిన్నర్‌కు బయటకు వెళ్లగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. విద్యార్ధిని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. బాధితురాలి స్నేహితుడితో సహా పలువురిని ప్రశ్నించామని చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో అందిన సమాచారం మేరకు రాత్రి 8-8.30 గంటల సమయంలో విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిందని పోలీసు అధికారి వెల్లడించారు.

దుర్గాపూర్‌లోని శివపూర్‌ ఏరియాలో గల ఐక్యూ మెడికల్‌ కాలేజీ గేటుకు సమీపంలో రాత్రి 8.30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వారిని అడ్డగించారు. వెంటనే ఆ స్నేహితుడు ఆమెను ఒక్కదాన్ని వదిలేసి వెళ్లిపోయాడు.  ఆ వచ్చినవారు ఆమె ఫోన్‌ను లాక్కుని, కేంపస్‌ వెలుపల దట్టంగా చెట్లు వున్న ప్రాంతంలోకి ఆమెను లాక్కుని వెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పర్యవసానాలు వుంటాయని వారు హెచ్చరించారని పోలీసు అధికారి వెల్లడించారు. 

మెడికో ఫోన్‌ తిరిగి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని కూడా డిమాండ్‌ చేశారని, రూ. 5 వేలు తీసుకున్నారని తెలిపారు. ఆ తరువాత బాధితురాలిని స్నేహితుడు కాలేజీకి తీసుకెకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు విద్యార్థిని స్ట్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు పోలీసులు చెప్పారు.  ‘గత రాత్రే బాధితురాలి ఫ్రెండ్‌తో కూడా మాట్లాడాం. సిసి టివి ఫుటేజీ సేకరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఫోరెన్సిక్‌ బృందం సంఘటనా స్థలానికి వెళ్ళి సాక్ష్యాధారాలను సేకరించింది.” అని చెప్పారు.

తమ కుమార్తె స్నేహితుల నుండి ఫోన్‌ రావడంతో శనివారం ఉదయమే తాము దుర్గాపూర్‌ వెళ్లామని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె తల్లిదండ్రులు విలేకర్లకు తెలిపారు. డిన్నర్‌ కోసం తన కుమార్తెతో కలిసి వెళ్లిన యువకుడు అక్కడ నుండి పారిపోయినందున అతడి ప్రమేయం కూడా వుందని అనుమానిస్తున్నామని బాధితురాలి కుటుంబం తెలిపింది. ఆ స్నేహితుడు తన కుమార్తెను తప్పుదారి పట్టించాడని, ఆమెను ఖాళీగా వున్న ప్రదేశానికి తీసుకెళ్లాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.

బాధితురాలిని కలిసిన తర్వాత,  జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లు) సభ్యురాలు అర్చన మజుందార్ మాట్లాడుతూ, “ఇది నిజంగా దురదృష్టకరం, ఆందోళనకరమైనది. నేను చాలా షాక్ అయ్యాను. హాస్టల్‌లో ఉంటున్న వైద్య విద్యార్థిని రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆహారం కోసం బయటకు వెళ్ళింది. ఆ సమయానికి, ఆమె మగ స్నేహితులలో ఒకరు ఆమెతో ఉన్నప్పటికీ, ఆమెపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆ అమ్మాయి తాను ఆ ప్రాంతంలో ఉన్నానని, తన స్నేహితుడితో కలిసి మధ్యలో నడుస్తున్నప్పుడు, కొంతమంది తమను వెంబడిస్తున్నట్లు గమనించానని చెప్పింది” అని తెలిపారు. 
 
“ఈ వ్యక్తులలో ఒకరు వృద్ధుడు, చాలా దూరంలో ఉన్నాడు. ఆ వ్యక్తి వారిని వెంబడించాడు. ఆమె భయపడింది. వారు ఆమెను అడవి వైపుకు లాగారు. అక్కడ, ఆమెను 4-5 మంది పురుషులు చుట్టుముట్టారు. వారిలో ఒకరు ఆమెపై పూర్తిగా అత్యాచారం చేశారు. దీనివల్ల గాయాలు అయ్యాయి. తరువాత, మరొక వ్యక్తి కూడా ఆమెను వేధించాడు. ఇంతలో, ఆమె స్నేహితుడు తిరిగి వచ్చి ఆమెను రక్షించాడు. ఆమె తిరిగి ఆసుపత్రికి వెళ్ళింది” అని ఆమె వివరించారు. 
 
నిజమైన ఆందోళన ఏమిటంటే, ఇంత పెద్ద సౌకర్యం ఉన్న, నగరానికి చాలా దూరంలో లేని వైద్య కళాశాల సిసిటివి కెమెరా లేకుండా పనిచేస్తుందని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. “కళాశాల ప్రాంగణం వెలుపల, గేటు వద్ద సరైన వెలుతురు లేదా భద్రత లేకపోతే, ఎవరు బయటకు వెళ్తున్నారో లేదా తిరిగి వస్తున్నారో అది ప్రతిబింబించదు. పోలీసు నిఘా లేదా పెట్రోలింగ్ లేకపోయినా, ఇటువంటి సంఘటనలు జరగవచ్చు” అని ఆమె చెప్పారు. 
 
“బాధితురాలి తండ్రితో డిఐజి స్థాయి అధికారి పినాక్ మిశ్రా మాట్లాడారు. బాధితుడి కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడానికి ఒక పోలీసు అధికారి, ఒక పరిపాలనా అధికారితో కూడిన బృందం దుర్గాపూర్‌ను సందర్శిస్తుంది. బాలసోర్‌లోని డిఐజి, బాలసోర్‌లోని ఎస్పీ దుర్గాపూర్ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు” అని బాలసోర్‌లోని తూర్పు శ్రేణి డిజిపి
 
ఈ పరిణామంపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తీవ్రంగా స్పందిస్తూ పొరుగు రాష్ట్రంలోని తన సహచర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందితుడిపై చర్య తీసుకోవడంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ సంఘటనను మాఝి తీవ్రంగా ఖండిస్తూ, దీనిని “చాలా ఖండించదగినది,  బాధాకరమైనది” అని అభివర్ణించారు.
 
 దుర్గాపూర్‌లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత బిజెపి నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ, మమతా బెనర్జీ ప్రభుత్వంలో బెంగాల్‌లో ఏ మహిళ కూడా సురక్షితంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. “పోలీసులు ముఖ్యమంత్రిని, ఆమె కళంకిత మేనల్లుడిని మాత్రమే రక్షిస్తారు. టిఎంసి కోసం డబ్బు వసూలు చేస్తారు”, అని ఆయన ధ్వజమెత్తారు.