
యూకేకు చెందిన తొమ్మిది విశ్వవిద్యాలయాలు భారత్లో క్యాంపస్లను ప్రారంభిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం తాలుక గురుగ్రామ్ క్యాంపస్ ఇప్పటికే ప్రారంభమైందని, అక్కడ ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. ముంబయిలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తో ఉన్నత స్థాయి చర్చల అనంతరం ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.
“భారత్-యూకే భాగస్వామ్యం విశ్వసనీయమైనది. ప్రతిభ, సాంకేతికత ఆధారితమైనది. యూకే ప్రధాని స్టార్మర్ నాయకత్వంలో భారత్, యూకే సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. భారత్, యూకే సహజ భాగస్వాములు. ప్రస్తుత ప్రపంచ అస్థిరత యుగంలో ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఈ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక పురోగతికి ఒక ముఖ్యమైన పునాది.” అని మోదీ తెలిపారు.
భారత్-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. భారత్-యూకే సంబంధాలలో కొత్త శక్తి ఉందని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వం, ఆర్థిక పురోగతికి కీలకమైన పునాదిగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ఇండియా-బ్రిటన్ సంబంధాలకు పునాది ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువలపై ఉన్న ఉమ్మడి నమ్మకమేనని తెలిపారు.
“ఈరోజు సమావేశంలో, మేము ఇండో-పసిఫిక్, పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం, ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించాం. ఉక్రెయిన్- రష్యా యుద్ధం, గాజా సంఘర్షణ వంటి అంశాలపై చర్చించాం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూకేతో సముద్ర భద్రతా సహకారాన్ని పెంపొందించడానికి భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది” అని ప్రధాని స్పష్టం చేశారు.
“కీలకమైన ఖనిజాలపై సహకారం కోసం ఇండస్ట్రీ గిల్డ్, సప్లై చైన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. సైనిక శిక్షణలో సహకారంపై భారత్, యూకే ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత వైమానిక దళ ఫ్లయింగ్ బోధకులు యూకేలోని రాయల్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షకులుగా పనిచేస్తారు.” అని మోదీ వ్యాఖ్యానించారు.
భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో ప్రధాని మోదీతో సమావేశం కావడం చాలా ముఖ్యమని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభిప్రాయపడ్డారు. భారతదేశ వృద్ధి కథ చాలా అద్భుతమైనదని కొనియాడారు. 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్, ప్రధాని మోదీ నాయకత్వాన్ని తాను అభినందించాలనుకుంటున్నానని వెల్లడించారు. 2047 నాటికి భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు.
More Stories
స్థానిక సంస్థల ఎన్నికలు, జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే
దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్
పొంగులేటి ఒంటెత్తు పోకడలపైమహిళా మంత్రుల అసహనం