
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తొలిదశ ప్రారంభించిన మహారాష్ట్రలోని నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎన్ఎంఐఏ) దేశంలోనే మొదటి పూర్తిగా డిజిటల్ ఎయిర్పోర్ట్ అనే విశేషతను సంతరించుకుంది. ఆధునిక సాంకేతికత, స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్, పేపర్లెస్ చెక్-ఇన్ వంటి సదుపాయాలతో ఈ ఎయిర్పోర్ట్ భారతీయ విమాన సదుపాయాలకు కొత్త దిశను చూపనుంది.
1,160 హెక్టార్ల విస్తీర్ణంలో, రూ.19,650 కోట్ల అంచనా వ్యయంతో ఈ అంతర్జాతీయ విమానాశ్రయంను నిర్మించారు. నవీ ముంబై ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతను అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (74%), సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిఐడిసిఓ – 26%) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేక దశల్లో జరుగుతోంది. మొదటి దశ ప్రారంభంతోనే విమాన ప్రయాణికుల రాకపోకలకు కొత్త మార్గం సిద్ధమవుతోంది.
ముంబై నగరంలోని ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉన్న రద్దీని తగ్గించడమే ఈ కొత్త ఎయిర్పోర్ట్ ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ టెర్మినల్ ఏటా 9 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించగల సామర్థ్యం కలిగివుంది. మొదటి దశలో దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాల కోసం సంవత్సరానికి 2 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ఉంది.
ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ “నవీ ముంబై ఎయిర్పోర్ట్ కేవలం మౌలిక వసతుల ప్రాజెక్టు మాత్రమే కాదు, మహారాష్ట్ర అభివృద్ధి దిశగా ఒక గొప్ప మైలురాయి” అని తెలిపారు. ఆయన దేశం మొత్తం విమాన కనెక్టివిటీ పెంపుకు, పర్యాటకాభివృద్ధికి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఈ ఎయిర్పోర్ట్ దోహదం చేస్తుందని తెలిపారు. పర్యావరణ అనుకూలంగా రూపొందించిన ఈ ప్రాజెక్టులో సౌరశక్తి వినియోగం, వర్షపు నీటి సేకరణ, మరియు గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీలు అమలు చేయడం ప్రత్యేకతగా నిలిచాయి.
ఈ ప్రారంభంతో, ముంబై, పరిసర ప్రాంతాల వాణిజ్య, పరిశ్రమ రంగాలకు గ్లోబల్ కనెక్టివిటీ మరింతగా లభించనుంది. దక్షిణ ముంబయి నుంచి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవీ ముంబయిలోని ఉల్వే వద్ద ఉన్న ఎన్ఎంఐఏ విమానాశ్రయ నిర్మాణం దేశ జాతీయ పుష్పం కమలం నుంచి ప్రేరణ పొందింది. విప్పుతున్న రేకులను సూచించే 12 శిల్పకళా ఫీచర్ స్తంభాలు, టెర్మినల్ పైకప్పుకు మద్దతు ఇచ్చే 17 మెగా స్తంభాలు ఉన్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ముంబై వన్ యాప్ను కూడా ప్రారంభించారు. తద్వారా ప్రయాణికుల పలు ప్రయోజనాలు పొందవచ్చు. నైపుణ్యం, ఉపాధి, వ్యవస్థాపకత, ఆవిష్కరణ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో షార్ట్-టర్మ్-ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాంను కూడా ప్రధాని ప్రారంభించారు.
More Stories
ఈపీఎస్ కనీస పెన్షన్ రూ. 2,500కు పెంపు?
దేశంలో ఆరు నగరాల్లోనే సంపద సృష్టి
పెట్రోల్ వాహనాలతో సమానంగా విద్యుత్ వాహనాల ధరలు