స్మృతి మంధాన మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్

స్మృతి మంధాన మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసిసి) తాజా మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్‌ స్మృతి మంధాన అదరగొడుతోంది. ఐసిసి మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మంధాన 791 పాయింట్లలో మరోసారి టాప్‌లో నిలువగా, న్యూజిలాండ్‌పై విధ్వంసక శతకం బాదిన తంజిమ్‌ బ్రిస్త్‌ (దక్షిణాఫ్రికా) టాప్‌-5లోకి దూసుకొచ్చింది.  ఇండోర్‌ స్టేడియంలో రికార్డు శతకంతో సఫారీ జట్టును గెలిపించిన బ్రిస్త్‌ 706 రేటింగ్‌ పాయింట్లతో ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం సొంతం చేసుకుంది.

వన్డే ప్రపంచ కప్‌ ముందు ఆస్ట్రేలియాపై రెండు శతకాలతో మెరిసిన టీమిండియా వైస్‌ కెప్టెన్‌ వన్డే ప్రపంచకప్‌లో నిరాశపరిచినా, ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పు చోటు చేసుకోలేదు.  ఇంగ్లండ్‌ సారథి నాట్‌ సీవర్‌ బ్రంట్‌(731) రెండో ర్యాంక్‌ సాధించగా, ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ బేత్‌ మూనీ 713 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు.. ఆస్ట్రేలియాకే చెందిన అష్‌ గార్డ్‌నర్‌ 697 రేటింగ్‌ పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో నిలిచింది. టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌(612), దీప్తి శర్మ(610పాయింట్లు) 16, 17వ స్థానాల్లో నిలిచారు. 

ఇక బౌలర్ల జాబితాలో టాప్‌లో ఎక్లేస్టోన్‌(ఇంగ్లండ్‌) 792రేటింగ్‌ పాయింట్లతో టాప్‌లో నిలువగా, ఆస్ట్రేలియాకు చెందిన గార్డినర్‌(692), స్కట్‌(666), కిమ్‌ గ్రాత్‌(663) వరుసగా టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. దీప్తి శర్మ(640) 6వ స్థానంలో నిలించి టాప్‌-10 బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకొంది. దీప్తి శర్మ ఆల్‌రౌండర్ల జాబితాలోనూ 390పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది.