మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం

మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం
భారత సినీ రంగంలో నాలుగు దశాబ్దాలుగా తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈయనకు ఇప్పుడు భారత సైన్యం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సీవోఏఎస్‌ కమెండేషన్‌’ అవార్డు లభించింది. ఈ అవార్డు భారత ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్  చేత ప్రతి సంవత్సరం విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ప్రదానం చేయబడుతుంది. 

భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్వయంగా ఈ పురస్కారాన్ని మోహన్‌లాల్‌కు అందజేశారు. మంగళవారం న్యూ ఢిల్లీ లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్‌ లెఫ్టినెంట్‌ కర్నల్‌ హోదాలో పాల్గొన్నారు. సైన్యంలో విశిష్ట సేవలందించిన వారిని సత్కరించేందుకు ఇచ్చే ఈ అవార్డు మోహన్‌లాల్‌ కెరీర్‌లో మరో ప్రాధాన్యత సాధించింది. 

ఈ సందర్భంగా మోహన్‌లాల్‌  సోషల్‌మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకుంటూ.. “ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు గర్వకారణం. ఒక గౌరవ లెఫ్టినెంట్‌ కర్నల్‌  గా ఈ గుర్తింపు పొందడం నా జీవితంలో స్ఫూర్తిదాయకమైన క్షణం. భారత సైన్యం, టెరిటోరియల్‌ ఆర్మీ యూనిట్‌ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

మోహన్‌లాల్‌ 2009లో భారత టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కర్నల్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆయన సైనిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం అవుతూ, దేశానికి తనవంతు సేవలు అందిస్తున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా, దేశ సేవకు అంకితమయ్యే వ్యక్తిగా కూడా ఆయన అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. 

ఇటీవలే మోహన్‌లాల్‌కు భారత ప్రభుత్వం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు  ప్రకటించింది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు ఇచ్చారు. వరుసగా ఇలాంటి గౌరవాలు దక్కించుకోవడం ద్వారా మోహన్‌లాల్‌ తన సత్తా ఏమిటో మరోసారి రుజువు చేశారు.