బీహార్‌ ఎన్నికల్లో కొత్తగా 17 సంస్కరణలు

బీహార్‌ ఎన్నికల్లో కొత్తగా 17 సంస్కరణలు
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కొత్తగా 17 సంస్కరణలు తీసుకువస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. వీటిలో కొన్ని ఎన్నికల నిర్వహణకు సంబంధించినవి కాగా, మరికొన్ని కౌంటింగ్‌కు సంబంధించినవి. భవిష్యత్‌లో వీటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. 

ఎన్నికలకు సంబంధించిన అన్ని సేవలను ఒకే వేదికపైకి తెచ్చేలా సింగిల్ యాప్ను తీసుకువచ్చింది ఈసీ. వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫారమ్ ఈసీఐ నెట్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం వివిధ యాప్లు, వెబ్సైట్లో అందిస్తున్న దాదాపు 40 సేవలను ఈ యాప్ కిందకు తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఫలితంగా ఓటర్లు అనేక యాప్లు, వెబ్సైట్లు ఆశ్రయించాల్సిన అవసరం తప్పుతుందని తెలిపింది. ఇందులో పేర్లు తనిఖీ, డిజిటల్ ఫోటో ఓటర్ స్లిప్ డౌన్లోడ్, ఫిర్యాదులు, ఓటింగ్ శాతం, ఫలితాలు తెలుసుకోవచ్చని వివరించింది.

బురఖా ధరించి వచ్చే ఓటర్లపైనా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. త్వరలో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేసేందుకు అంగన్వాడీ వర్కర్లను వినియోగించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.పోలింగ్ స్టేషన్లో ఉండే సీసీటీవీ ఫుటేజీని కేవలం హైకోర్టులతో మాత్రమే పంచుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

  • ఓటర్ రిజిస్ట్రేషన్ జరిగిన 15 రోజుల్లో ‘ఎపిక్’ (ఎలక్ట్రో ఫోటో ఐడెంటిటీ కార్డులు) డెలివరీ చేయాలి.
  • ఇకపై ఏ పోలింగ్‌ కేంద్రంలోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండరు. ప్రస్తుతం 1,500 మంది ఓటర్లు ఉంటున్నారు.
  • బీహార్‌ ఎన్నికలను ఈ సారి రెండు దశల్లోనే పూర్తి చేయనున్నారు.. గతంలో మూడు విడతల్లో పోలింగ్‌ జరిగింది.
  • ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలను ఉంచనున్నారు.
  • సీరియల్ నెంబర్ కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాట్లు.
  • ఈసారి బూత్ స్థాయి అధికారులకు అధికారిక ఐడీ కార్డులు.. వారిని గుర్తించడం తేలికవుతుంది.
  • రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్‌ వద్ద మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసే సౌకర్యం.
  • ఎన్నికల ప్రక్రియకు మరింత పారదర్శకత కల్పిస్తూ అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ వెబ్‌కాస్టింగ్ కవరేజ్ ఉంటుంది.
  • పోలింగ్ స్టేషన్లలో 100% వెబ్‌కాస్టింగ్
  • ఈసీఐనెట్ యాప్ ద్వారా ఎప్పటిక‌ప్పుడు ఎన్నిక‌ల స‌ర‌ళి గురించి అప్‌డేట్.. ఓటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్రతి రెండు గంట‌ల‌కు ఒక‌సారి ఈ యాప్‌లో ఓటింగ్ డేటా అప్‌డేట్ అవుతుంది.
  • ఓట‌ర్ ఇన్ఫర్మేష‌న్ స్లిప్‌ల‌ను కొత్తగా ఇవ్వనున్నారు. ఆ స్లిప్స్‌పై ఓట‌రు ఐడీ నెంబ‌ర్ స్పష్టంగా క‌నిపిస్తుంది.
  • అభ్యర్థులను పోలింగ్‌ స్టేషన్ల నుంచి 100 మీటర్ల దూరం వరకే అనుమతిస్తారు.
  • చివరి రెండు రౌండ్ల ఈవీఎం లెక్కింపుకు ముందు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును తప్పనిసరి చేశారు. దీంతో ఫలితాల పారదర్శకత మరింత పెరుగుతుంది.
  • ఈవీఎం డేటా సరిపోలడం లేదంటూ ఫిర్యాదులు వచ్చినప్పుడు వీవీప్యాట్‌ స్లిప్పులను తప్పనిసరిగా వెరిఫై చేయడం.. వంటి సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ఈసీ ప్రకటించారు.