
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం గల్లంతైన వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఇది క్షమించరాని పాపమని, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం హయాంలో జరిగిన మరో భారీ కుంభకోణమని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని, ఈ కేసును తక్షణమే కేంద్ర ఏజెన్సీకి అప్పగించాలని ఆయన స్పష్టం చేశారు.
“రాష్ట్ర హోంమంత్రి ఆధీనంలో పనిచేసే కేరళ పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేరు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ హోంమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నందున, వారి దర్యాప్తులో నిజాలు బయటకు రావు. అందుకే ఈ కుంభకోణంపై కేంద్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలి” అని ఆయన కోరారు.
ఇప్పటికే పినరయి విజయన్ ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో కూరుకుపోయిందని, ఆయన కుమార్తె కంపెనీ వ్యవహారాలు, ముఖ్యమంత్రి కార్యదర్శి బంగారం స్మగ్లింగ్ కేసులే ఇందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సంస్థలే పవిత్రమైన శబరిమల ఆలయం నుంచి బంగారాన్ని దోచుకోవడం అత్యంత సిగ్గుచేటని రాజీవ్ చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
“ఆలయ ఆస్తుల పరిరక్షణ బాధ్యత చూడాల్సిన ప్రభుత్వ ఆధ్వర్యంలోని దేవస్వం బోర్డు పూర్తిగా విఫలమైంది. బంగారం తాపడం చేయించే పేరుతో పంపిన దాదాపు నాలుగున్నర కిలోల బంగారం మాయమైంది. అసలు తాపడం చేయించాల్సిన అవసరం లేనప్పుడు బంగారాన్ని బయటకు ఎందుకు పంపారు? ఈ బంగారం తీసుకెళ్లిన వ్యక్తికి కాంగ్రెస్, సీపీఎం పార్టీలతో దగ్గరి సంబంధాలున్నాయి. అతనికి ఈ అధికారం ఎవరిచ్చారు?” అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
2009 నుంచి 2013 మధ్య కాలంలో వినియోగించిన బంగారం స్థానంలో ఇప్పుడు ఇత్తడి, రాగిని చేర్చారని మరో కథనం ప్రచారంలో ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ పరిణామాలపై భక్తులే కాకుండా మలయాళీలందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. దేవాలయాల్లో కూడా అవినీతి జరగడాన్ని ఊహించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. దేవస్వం మంత్రి, దేవస్వం బోర్డు ఛైర్మన్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.
ఇదిలా ఉండగా, శబరిమల బంగారం గల్లంతు వివాదంపై దర్యాప్తు చేసేందుకు ఏడీజీపీ హెచ్. వెంకటేశ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కూడా సూచించింది.
More Stories
మావోయిస్టుల్లో మల్లోజుల రాజీనామా ముసలం
‘మీపై దాడి భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది’
బీహార్ ఎన్నికల్లో కొత్తగా 17 సంస్కరణలు