బీసీ రిజర్వేషన్లపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

బీసీ రిజర్వేషన్లపై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో విచారణకు స్వీకరించలేమని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది.  తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై వంగా గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

దీనిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం హైకోర్టులో విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని పిటిషనర్‌ తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీంతో తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని ఆయన బదులిచ్చారు.  దీంతో అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా? అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో పెండింగ్‌ ఉన్నందున విచారణకు స్వీకరించలేమని పిటిషన్‌ను కొట్టేసింది. 

రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సెప్టెంబర్‌ 26న జీవో నంబర్‌ 9 జారీ చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ప్రకటించింది. దీనిని సామాజిక న్యాయంగా వర్ణించింది. ఈ జీవో ఆధారంగా రిజర్వేషన్ల గెజిట్లను పంచాయతీరాజ్‌శాఖ విడుదల చేసింది. ఆ మేరకు తెలంగాణలో స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. 

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు దఫాల్లో, పంచాయతీ ఎన్నికలు మూడు దఫాల్లో మొత్తం ఐదు దశల్లో అక్టోబర్‌ 9 నుంచి నవంబర్‌ 11 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నది. అయితే, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్‌చేస్తూ మాధవరెడ్డి హైకోర్టు పిటిషన్‌ వేశారు. గత రిజర్వేషన్లు రద్దుచేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు.

విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, విచారణను 8వ తేదీకి వాయిదా వేయింది. ఇదిలా ఉండగానే సుప్రీంకోర్టులో వంగా గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి మరో పిటిషన్‌ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని గోపాల్‌ రెడ్డి తన పిటిషన్‌లో తెలిపారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్‌ దాటవద్దని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్‌ను ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. 

ఎస్సీలకు15 శాతం రిజర్వేషన్‌, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్‌ 42 శాతంతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు 67 శాతం అవుతున్నదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో 9ను తక్షణమే రద్దుచేయాలని కోరారు. ఈ పిటిషన్‌లో మాధవరెడ్డి, తీన్మార్‌ మల్లన్న ఇద్దరు కూడా ఇంప్లీడ్‌ అయ్యారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది.