ఆమెరికాలో కాల్పులు.. హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి మృతి

ఆమెరికాలో కాల్పులు.. హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి మృతి
ఆమెరికాలో పెరిగిపోతున్న గన్‌ కల్చర్ మరో అమాయకుడిని బలి తీసుకుంది. డల్లాస్‌లో నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ఎల్బీ నగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్‌కు చెందిన పోలే చంద్రశేఖర్ (27) 2023లో బిడిఎస్ పూర్తి చేసి, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు.  
అక్కడే ఓ గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌లో పార్ట్‌ టైం జాబ్‌ చేస్తున్నారు.
ఈ క్రమంలో చంద్రశేఖర్‌ విధుల్లో ఉన్న సమయంలో ఓ దుండగుడు వచ్చి ఆదివారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, కాల్పులకు పాల్పడింది ఓ నల్లజాతీయుడు అని సమాచారం.  ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించాల్సి ఉంది. 
దుండగుల కాల్పుల్లో ఎల్బీనగర్ విద్యార్థి పోలె చంద్రశేఖర్ మరణించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. డల్లాస్లో చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందని సీఎం తెలిపారు. చంద్రశేఖర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్నివిధాలా సహకారం అందిస్తామని  చెప్పారు.
బాధిత కుటుంబాన్ని వాళ్ల ఇంటికి స్థానిక ఎమ్మెల్సే సుధీర్ రెడ్డితో వెళ్లి మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు.  ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసి గుండె తరుక్కపోతుందని పేర్కొన్నారు. వారి కుటుంబాని తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్రశేఖర్ మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి తరలించేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు.