స్పష్టమైన లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్ను భారత్ ప్రారంభించిదని, లక్ష్యం నెరవేరిన తర్వాత త్వరగా యుద్ధాన్ని ముగించిందని పేర్కొంటూ. యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సూచించారు. భారత్ దాడుల్లో పాక్కు చెందిన ఎఫ్-16, ఎఫ్-17 యుద్ధ విమానాలు నేలకూలినట్లు తెలిపారు.
సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ కోసం త్రివిధ దళాలు పని చేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు. “ఆపరేషన్ సిందూర్ చరిత్రలో నిలిచిపోయే ఒక పాఠంలా నిలుస్తుంది. ఈ యుద్ధం స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించాం. దానిని దీర్ఘకాలం పొడిగించకుండా త్వరగా ముగించాం. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం” అని గుర్తు చేశారు.
“రెండు యుద్ధాలు (గాజా-ఇజ్రాయెల్, రష్యా- ఉక్రెయిన్) ముగింపు గురించి అసలు ఎలాంటి చర్చలు లేవు. కానీ మనం త్వరగా పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం అడిగేలా చేశాం. నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరినందున ఆ శత్రుత్వాలను ముగించాలని మేం కూడా నిర్ణయించాం. ఈ విషయాన్ని ప్రపంచం మనల్ని చూసి నేర్చుకోవలసిన అంశంగా నేను భావిస్తున్నాను”అని ఏపీ సింగ్ తెలిపారు.
ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చెందిన 5 యుద్ధ విమానాలను నేలకూల్చినట్లు ఏపీ సింగ్ వెల్లడించారు. త్రివిధ దళాల సమన్వయంతో పాక్కు చెందిన పది ఫైటర్ జెట్ విమానాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. వాటిలో ఎఫ్-16, ఎఫ్-17 యుద్ధ విమానాలు ఉన్నట్లు పేర్కొన్నారు. శత్రువుల స్థావరాలను గురిచూసి కొట్టడంతో పాక్లోని ఉగ్రస్థావరాలతో పాటు రాడార్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లు, యుద్ధ విమానాలు, ధ్వంసమయ్యాయని ఏపీ సింగ్ చెప్పారు.

More Stories
భావోద్వేగాల ఉప్పెనను రేకెత్తిస్తున్న వందేమాతరం
ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి దేశం నుంచి పంపిస్తాం
బీఎంసీ ఎన్నికల్లో బిజెపి 150 సీట్ల వరకు పోటీ!