బిహార్ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించే లక్ష్యం

బిహార్ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించే లక్ష్యం
 
* యువత కోసం రూ.62 వేల కోట్ల పధకాలు
 
బీహార్​ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నితీష్ కుమార్ సర్కార్​ ఆలోచన చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం బిహార్​లో యువత కోసం విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ ఆర్​జేడీ పాలనలో బీహార్​ విద్యాపరంగా వెనుకబడిందని, అందుకే వలసలు పెరిగాయని ఆరోపించారు. 
ఇలాంటి దుర్భర పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని ఎన్​డీఏ సర్కార్​ పురోగతి మార్గం పట్టించిందని ప్రశంసలు కురిపించారు.
బీహార్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కొత్త నిర్ణయాలు తీసుకుందని, గత 20 ఏళ్లతో పోల్చితే, వచ్చే ఐదేళ్లలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్యలను రెట్టింపు చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. 20-25 ఏళ్ల క్రితం బిహార్ విద్యావ్యవస్థపై జరిగిన విధ్వంసం గురించి ప్రస్తుత యువతకు తెలియకపోవచ్చని, ఆర్​జేడీ లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పించారు. ఆర్​జేడీ పాలనలో పాఠశాలలు మూతపడి ఉండేవని, ఉపాధ్యాయ నియామకాలు కూడా తక్కువగా జరిగేవని, అందుకే విద్యార్థులు రాష్ట్రం వదిలి ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేందని మోదీ పేర్కొన్నారు. 

వేర్లు కుళ్లిపోతున్న చెట్టును పునరుద్ధరించడం చాలా కష్టమని, అయితే ఎన్​డీఏ సర్కార్​ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి దిశగా నడిపించడానికి కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. దేశంలో యువతకు సంబంధించిన పలు పథకాలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌కు సంబంధించి రూ.62వేల కోట్ల విలువైన పథకాలను డిల్లీలోని విజ్ఞాన్ భవన్‌ వేదికగా ప్రారంభించారు. 

దేశంలో ఐటీఐల ఆధునికీకరణకు సంబంధించి ‘పీఎం-సేతు’ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.60వేల కోట్లు వెచ్చించనుంది. దీనితో దేశంలోని వెయ్యి ప్రభుత్వ ఐటీఐల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ లెర్నింగ్‌, ఇంక్యుబేషన్‌ వంటి వసతులు కల్పించనున్నారు. ప్రధాని మోదీ శనివారం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 400 నవోదయ విద్యాలయాలు, 200 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 12 వందల ఒకేషనల్‌ స్కిల్‌ ల్యాబ్‌లను ప్రారంభించారు.

ఈ స్కిల్‌ ల్యాబ్‌లలో ఐటీ, ఆటోమోటివ్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, టూరిజం వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.  మరోవైపు బిహార్‌కు సంబంధించిన పలు పథకాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. విద్యార్థులకు ప్రతి నెల రూ.1000 ఇచ్చే ‘ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయతా బత్తా యోజన’, 4 లక్షలు వరకూ వడ్డీలేని రుణాలు ఇచ్చే ‘స్టూడెంట్ క్రెడిట్‌కార్డు’ వంటి పథకాలను ఆయన స్వయంగా ప్రారంభించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.”రాహుల్ గాంధీని కాంగ్రెస్​ పార్టీ సభ్యులు తరచుగా జన్​ నాయక్​ అని ప్రశంసిస్తారు. వాస్తవానికి ఇది ఓబీసీ నాయకుడైన బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్​కు సంబంధించిన గౌరవనీయ పదం. దాన్ని ఇప్పుడు కొందరు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల పట్ల బిహార్​ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని ప్రధాని ఎద్దేవా చేశారు.

కర్పూరి ఠాకూర్​కు ఎవరూ జన్​ నాయక్​ అనే బిరుదు ఇవ్వలేదు. కానీ అది ఆయన పట్ల ప్రజల ప్రేమకు ప్రతిబింబం అని మోదీ వ్యాఖ్యానించారు. దివంగత నేత కర్పూరి ఠాకూర్​కు గతేడాది మోదీ సర్కార్​ భారతరత్న పురస్కారం ప్రకటించారు.