ఐఎస్ఐ కోసం గూఢ‌చ‌ర్యంలో యూట్యూబ‌ర్ వసీం అరెస్ట్

ఐఎస్ఐ కోసం గూఢ‌చ‌ర్యంలో యూట్యూబ‌ర్ వసీం అరెస్ట్
హ‌ర్యానా యూట్యూబ‌ర్ జ్యోతి మ‌ల్హోత్రా పాకిస్తాన్ త‌ర‌పున గూఢ‌చ‌ర్యం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా అదే హ‌ర్యానాకు చెందిన మ‌రో యూట్యూబ‌ర్ వ‌సీం అక్ర‌మ్ కూడా పాకిస్తాన్ ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్ త‌రపున గూఢ‌చ‌ర్యం చేస్తున్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
మేవాట్ హిస్ట‌రీపై యూట్యూబ్‌లో వీడియోలు చేసిన అక్ర‌మ్‌ను బుధ‌వారం రాత్రి అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. 
పాల్వాల్ జిల్లాలోని కోట్ గ్రామానికి చెందిన వ‌సీం అక్ర‌మ్ గ‌త మూడేండ్ల నుంచి పాకిస్తాన్ ఏజెంట్ల‌తో సంబంధాలు కొనసాగిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. అక్ర‌మ్ వాట్సాప్‌ను ప‌రిశీలించ‌గా, నేర‌పూరిత సందేశాల‌ను గుర్తించామ‌న్నారు.  అత‌ని ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే అక్ర‌మ్ గూఢ‌చ‌ర్యానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌న్నారు. గ‌త వారం ఇదే పాల్వాల్ పోలీసులు పాకిస్తాన్ గూఢ‌చారి తౌఫిక్‌ను అరెస్టు చేశారు.
తౌఫిక్ ద్వారానే వ‌సీం అక్ర‌మ్ గురించి పోలీసుల‌కు తెలిపింది. దీంతో అక్ర‌మ్‌ను అరెస్టు చేశారు.  2021లో అక్ర‌మ్ పాకిస్తాన్ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పుడు పాకిస్తాన్ ఏజెంట్ డానిష్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యంతో అక్ర‌మ్, తౌఫిక్ ఇద్ద‌రూ క‌లిసి ఇంట‌ర్నెట్ కాల్స్ ద్వారా ఐఎస్ఐ, పాకిస్తాన్ హైక‌మిష‌న్‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తేలింది. 
 
ఢిల్లీకి వెళ్లిన సమయంలో అక్రమ్ సున్నితమైన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడమే కాకుండా సిమ్ కార్డును కూడా సరఫరా చేశాడని పోలీసులు తెలిపారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా, అతను ఐఎస్ఐ కాంటాక్ట్‌లతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉన్నాడని అనుమానిస్తున్నారు. అక్రమ్ ఫోన్‌ను పరిశీలించినప్పుడు పోలీసులు అనేక నేరపూరిత వాట్సాప్ చాట్‌లను కనుగొన్నారు. వాటిలో కొన్ని తొలగించి ఉన్నాయి.
సమాచార ప్రవాహాన్ని గుర్తించడానికి, పాకిస్తాన్ కార్యకర్తలతో ఏ సున్నితమైన వివరాలు పంచుకున్నాయో తెలుసుకోవడానికి సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పుడు తొలగించిన సందేశాలను తిరిగి పొందడానికి కృషి చేస్తున్నారు. కేసును క్షుణ్ణంగా ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్పీ వ‌రుణ్ సింగ్లా పేర్కొన్నారు.