దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు

దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
అంతకుముందు సంవత్సరాల కంటే 2023లో దేశవ్యాప్తంగా వరకట్న కేసులు 14 శాతం పెరిగాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2023లో దేశవ్యాప్తంగా 15 వేల వరకట్న కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపులకు 6,100 మంది మహిళలు బలయ్యారు అని ఎన్‌సిఆర్‌బి నివేదిక తెలిపింది. 
 
2023లో వరకట్న నిషేధ చట్టం కింద 15,489 కేసులు నమోదయ్యాయని ఎన్‌సిఆర్‌బి క్రైమ్‌ ఇన్‌ ఇండియా 2023 నివేదిక పేర్కొంది. 2022లో 13,479, 2021లో 13,568 ఈ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 2021 – 2022 కంటే 2023లో 14 శాతం వరకట్న కేసులు పెరిగాయని ఎన్‌సిఆర్‌బి నివేదిక స్పష్టం చేసింది.
 
రాష్ట్రాల వారీగా చూస్తే వరకట్నపు కేసుల్లో ఉత్తరప్రదేశ్‌నే మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో వరకట్న నిషేధ చట్టం కింద 7,151 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత బీహార్‌ 3,665, కర్ణాటక 2,322ల కేసులతో వరుస స్థానాల్లో నిలిచాయి. పశ్చిమ బెంగాల్‌, గోవా, అరుణాచల్‌ప్రదేశ్‌, లడక్‌, సిక్కిం సహా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వరకట్న కేసులు నమోదవ్వకపోవడం గమనార్హం.
 
వరకట్న వేధింపుల వల్ల 2023లో మొత్తం 6,156 మంది మహిళలు మృతి చెందారు. ఈ మరణాల్లో కూడా ఉత్తరప్రదేశ్‌నే మొదటిస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో వరకట్న మరణాలు 2,122 నమోదయ్యాయి. బీహార్‌ 1,143. 2023లో దేశవ్యాప్తంగా 833 హత్య కేసుల్లో వరకట్నమే ప్రధానకారణంగా నమోదైనట్లు ఎన్‌సిఆర్‌బి నివేదిక తెలిపింది. 
 
ఇక వరకట్న నిషేధ చట్టం కింద 2023లో 83,327 కేసులు కోర్టు ముందు విచారణకు వచ్చాయి. వీటిల్లో 69,434 కేసులు అంతకుముందు సంవత్సరాల కంటే.. వేగవంతంగా కోర్టు విచారణకు వచ్చాయి. ఈ చట్టం కింద 2023లో 27,154 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 22,316 మంది పురుషులు, 4,838 మహిళలు ఉన్నారని ఎన్‌సిఆర్‌బి నివేదిక వెల్లడించింది.