అమరావతిలో 12 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు

అమరావతిలో 12 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో బ్యాంకింగ్ సేవలను కేంద్రీకరించే దిశగా పెద్ద అడుగు వేసింది. రాజధానిలో ఒకేసారి 12 ప్రధాన బ్యాంకుల హెడ్ ఆఫీసులకు శంకుస్థాపన చేయడానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎసిబిఐ)కి 3 ఎకరాలు, ఆంధ్ర ప్రదేశ్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (అప్కోబ్)కి 2 ఎకరాలు కేటాయించారు. 
 
కాగా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఓబి) వంటి బ్యాంకులకు 25 సెంట్ల చొప్పున భూమి కేటాయించబడింది. ఈ స్థల కేటాయింపుతో అమరావతిలో బ్యాంకింగ్ రంగానికి ఒక ప్రధాన కేంద్రం రూపుదిద్దుకోనుంది.  ప్రతి బ్యాంక్ కార్యాలయాన్ని 14 అంతస్తులు, లక్ష చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించే ప్రణాళిక రూపొందింది. 
 
ఈ భవనాలు ఆధునిక సాంకేతికత, సౌకర్యాలతో ఉండేలా డిజైన్ చేస్తున్నారని తెలిసింది. రాష్ట్ర రాజధానిలోని ఆర్థిక, పరిపాలన కార్యకలాపాలు సమగ్రంగా జరిగేలా ప్రత్యేక ఫైనాన్షియల్ జోన్‌ను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. భవిష్యత్‌లో ఈ కేంద్రం ద్వారా పెట్టుబడులు, రుణాల పంపిణీ, కార్పొరేట్ లావాదేవీలకు ఒకే వేదిక లభించనుంది. ప్రస్తుతం ఈ బ్యాంకులన్నీ విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
అమరావతిలో హెడ్ ఆఫీసులు స్థాపించడంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవల నిర్వహణ వేగవంతం అవుతుంది. కస్టమర్ సపోర్ట్, రుణ అనుమతులు, ప్రభుత్వ పథకాల నిధుల పంపిణీ వంటి సేవలు త్వరితంగా అందుబాటులోకి రావడానికి ఇది దోహదం చేస్తుంది. ఈ విధంగా అమరావతిలో బ్యాంకింగ్ రంగం సమగ్రంగా అభివృద్ధి చెందుతూ రాజధానికి కొత్త ఆర్థిక ఉత్సాహాన్ని తెచ్చిపెట్టనుంది.