
అండమాన్ బేసిన్లో భారీ మొత్తంలో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఈ ఆవిష్కరణతో అండమాన్ సముద్రంలో శక్తి అవకాశాల మహాసముద్రం తెరుచుకుందని కేంద్రమంత్రి అభివర్ణించారు. ఈ సందర్భంగా అండమాన్ సముద్రంలో ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో ఈ సహజ వాయువు నిల్వలు ఉన్నట్లు తేలిందని హర్దీప్ సింగ్ పూరీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అండమాన్ దీవుల తూర్పు తీరం నుంచి 9.20 నాటికల్ మైళ్లు, 17 కిలోమీటర్ల దూరంలో 295 మీటర్ల నీటి లోతులో తవ్విన శ్రీ విజయపురం 2 బావిలో ఈ సహజ వాయువు నిక్షేపాలు ఉన్నట్లు హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో గ్యాస్ ఉనికి బయటికి వచ్చిందని పేర్కొన్నారు. పరీక్షల్లో సేకరించిన నమూనాలను నౌక ద్వారా కాకినాడకు తీసుకువచ్చి పరీక్షించగా అందులో 87 శాతం మీథేన్ ఉన్నట్లు తేలిందని కేంద్ర మంత్రి వివరించారు.
ఈ ప్రాంతం మయన్మార్ నుంచి ఇండోనేషియా వరకు విస్తరించి ఉన్న ఇంధన సంపదకు కేంద్రంగా ఉందని తెలిపారు. ఈ ఆవిష్కరణతో అండమాన్ బేసిన్లో హైడ్రోకార్బన్లు ఉన్నాయని ఎప్పటి నుంచో మనం నమ్ముతోంది నిజమైందని హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ డీప్వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ నేషనల్ డీప్వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లక్ష్యాలను చేరుకోవడంలో తాజా ఆవిష్కరణ ఒక ప్రధాన ముందడుగుగా మారనుందని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మిషన్ను సముద్ర మంథన్ అని అభివర్ణించిన ప్రధాని మోదీ ఇంధన రంగంలో దేశాన్ని ఆత్మనిర్భర్ చేసేందుకు ఉద్దేశించబడిందని పేర్కొన్నారు.
ఇక ఈ సరికొత్త సహజ వాయువు నిల్వలను కనుగొని హైడ్రోకార్బన్ నిల్వలను పూర్తిగా వినియోగించుకోవడానికి దేశీయ, ప్రపంచ స్థాయి నిపుణులతో సమన్వయం చేసుకుంటున్నట్లు హర్దీపీ సింగ్ పూరీ వెల్లడించారు. రాబోయే కొన్ని నెలల్లో మరిన్ని డీప్వాటర్ అన్వేషణ బావుల తవ్వకాలకు ప్రణాళికలు రచించినట్లు చెప్పారు. భారతదేశ అమృత కాలం ప్రయాణంలో ఈ సహజ వాయువు ఆవిష్కరణ ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని కేంద్రమంత్రి నొక్కి చెప్పారు.
More Stories
జనరల్ రైలు టికెట్కు ఆధార్ తప్పనిసరి
విదేశీ సినిమాలపై ట్రంప్ 100 శాతం సుంకాలు
సెలబ్రిటీల రూ.కోట్ల విలువైన ఆస్తులను జప్తుకు సన్నాహాలు!