పీవోకే నుంచి ఉడాయించిన లష్కరే తోయిబా

పీవోకే నుంచి ఉడాయించిన లష్కరే తోయిబా
భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ దెబ్బకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు భయంతో వణికిపోతున్నారు. తీవ్ర దాడులతో విరుచుకుపడిన భారత బలగాలు, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేశాయి. ఈ పరిణామంతో ఉగ్రవాదులు భారత్ అంటే భయంతో పంజాబ్, పీవోకేలను వదిలి, సుదూరంగా ఉన్న ఖైబర్ పక్తుంఖ్వా ప్రాంతానికి తమ స్థావరాలను మార్చుకుంటున్నారు.

జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లతో పాటు లష్కరే తోయిబాను అమెరికా, ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కూడా వారికి సహాయం చేసే పరిస్థితుల్లో లేకపోవడంతో, ఉగ్రవాద సంస్థలు దూరంగా వెళ్తున్నాయని సమాచారం.  ఆఫ్ఘన్ సరిహద్దు నుంచి కేవలం 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయర్ దిర్ జిల్లాలో లష్కరే తోయిబా మర్కజ్ జిహాద్-ఎ-అక్సా అనే కొత్త స్థావరాన్ని నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు, వీడియోల ద్వారా తెలుస్తోంది.  ఆపరేషన్ సింధూర్ జరిగిన రెండు నెలల తర్వాత ఈ నిర్మాణం ప్రారంభమైందని చెబుతున్నారు. 

గతంలో, భింబర్-బర్నాలాలోని లష్కరే స్థావరం మర్కజ్ అహ్లే హదీస్ను భారత సైన్యం మే 7న ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ తమ  స్థావరాలపై తీవ్ర ప్రభావం చూపిందని లష్కరే తోయిబా కమాండర్లు అంగీకరించారు. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖాసిమ్ ఈ దాడి గురించి స్పందిస్తూ, మురిద్కేలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం భారత్ చేసిన దాడుల్లో ధ్వంసమైందని అంగీకరించాడు. 

ఈ కార్యాలయాన్ని మళ్లీ భారీగా నిర్మిస్తామని వ్యాఖ్యానించాడు. ఆ ధ్వంసమైన కార్యాలయంలో చాలామంది ముజాహిద్దీన్‌లు శిక్షణ తీసుకున్నారని తెలిపాడు. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ మరో వీడియోలో మాట్లాడుతూ, ఉగ్ర స్థావరాలను పునర్నిర్మించేందుకు పాక్ ప్రభుత్వం, సైన్యం నిధులు ఇచ్చినట్లు చెప్పడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్‌లో మొత్తం 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసమైనట్లు ఆయన తెలిపారు.