బీసీ బిల్లుపై గవర్నర్‌ తేల్చకముందే జీవోపై హైకోర్టు విస్మయం

బీసీ బిల్లుపై గవర్నర్‌ తేల్చకముందే జీవోపై హైకోర్టు విస్మయం
“అసెంబ్లీలో బిల్లు ఆమోదిస్తే చట్టమైపోతుందా? ఆ బిల్లును గవర్నర్‌ ఆమోదించాలి కదా? గవర్నర్‌కు బిల్లు పంపి 3 నెలలు కూడా కాకుండానే ఆ బిల్లులో నిర్దేశించినట్టు స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవోను ఎలా జారీ చేస్తారు? జీవో 9కి ఉన్న చట్టబద్ధత ఏమిటి? ఆ జీవోకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఎలా నిర్ణయిస్తారు? బిల్లుకు ఆమోదం లేకుండా అధికారులే చట్ట ఉత్తర్వులను (సబార్డినేట్‌ లెజిస్లేషన్‌) ఎలా జారీ చేస్తా రు?” అని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 
 
జీవో 9ను సవాలు చేస్తూ దాఖలైన అత్యవసర పిటిషన్లపై హైకోర్టు శనివారం దాదాపు గంటన్నరపాటు విచారణ జరిపింది. ఈ సందర్భంగా “బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీలో ఏ పార్టీ వ్యతిరేకించలేదు. ప్రభుత్వ ఉద్దేశం మంచి దే కావచ్చు. అయినప్పటికీ ఆ రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం అనుసరించే విధానం చట్టబద్ధమైనదిగా ఉండాలి కదా?” అని ప్రశ్నించింది. 
 
“పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285ఏ రద్దుకు అసెంబ్లీ చేసిన తీర్మానానికి అనుగుణంగా గవర్నర్‌ బిల్లును ఆమోదించకుండానే ప్రభుత్వం సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ చేయవచ్చునా? ఆ బిల్లు గవర్నర్‌కు పంపి నెల రోజులైనా తిరక్కుండానే ప్రభుత్వానికి తొందర ఏమిటి? బిల్లుకు గవర్నర్‌ ఆ మోదం లేకుండా జీవో 9ని ఎలా జారీ చేస్తారు? గవర్నర్‌ ఆమోదించే వరకు ఎందుకు ఆగడం లేదు?” అని ప్రశ్నించింది. 
 
గవర్నర్‌ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ముందుకు వెళ్లవచ్చని ఏ చట్టంలో ఉన్నదో, ఏ కోర్టు తీర్పు చెప్పిందో తెలియజేయండని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం కోరుతున్నట్టుగా ఆ పిటిషన్‌పై విచారణ వాయిదా వేస్తామని పేర్కొం టూ అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాబోదని ప్రభుత్వం హామీ ఇస్తుం దా? అని ప్రశ్నించింది. ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే జీవో 9 అమలును నిలిపివేయాల్సి వస్తుందని తెలిపింది.
 
అలా కాకుండా స్టేటస్‌ కో (యథాతథస్థితి) ఉత్తర్వులు జారీచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం బీసీ జనాభా/స్థితిగతులపై ఇప్పటివరకు డెడికేటెడ్‌ కమిషన్‌ నిర్వహించిన అధ్యయనంతోపాటు ఇతర తతంగమంతా పెద్ద సమస్యగా మారుతుందని పేర్కొంటూ ఏం చేయాలో ప్రభుత్వమే చెప్పాలని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ వివరణను తెలుసుకునేందుకు హైకోర్టు నుంచి బయటకు వెళ్లిన అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఏ సుదర్శన్‌రెడ్డి కొద్ది నిమిషాల తర్వాత తిరిగి వచ్చారు. 
 
అధికారులు ఎవరూ స్పం దించలేదని ఆయన చెప్పడంతో హైకోర్టు అరుదైన నిర్ణయాన్ని వెలిబుచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 8కి వాయిదా వేస్తున్నామని, ఈలోగా స్థానిక సంస్థలకు ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ వెలువరిస్తే తమ ముందున్న పిటిషన్లు విచారణకు మనుగడలో ఉంటాయని తేల్చి చెప్పింది.