బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్‌ మన్హాస్‌

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా మిథున్‌ మన్హాస్‌
డిల్లీ మాజీ కెప్టెన్‌ మిథున్‌ మన్హాస్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ముంబయిలో తాజాగా జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో మిథున్​ను అధ్యక్షుడి ఎన్నికున్నారు. రోజర్‌ బిన్నీ నిష్క్రమణతో బోర్డు అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ పదవిలోకి 45 ఏళ్ల మన్హాస్‌ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సైకియా కొనసాగనున్నారు. 

ట్రెజరర్​గా రఘురామ్‌భట్, జాయింట్‌ సెక్రటరీగా ప్రభుతేజ్‌సింగ్ భాటియా ఎంపికయ్యారు. కాగా, సౌరభ్ గంగూలి, రోజర్ బిన్నీ తర్వాత మాజీ క్రికెటర్ బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. కొత్త అధ్యక్షుడు మన్హాస్​ ఎంపికను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అధికారికంగా నిర్ధారించారు.

“బీసీసీఐకు కొత్త ప్రెసిడెంట్​గా మిథున్ మన్హాస్ ఎంపికయ్యారు. జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లాకు ఇది దివ్యమైన రోజు (ఆదివారం). నా సొంత జిల్లా కూడా ఇదే కావడం ఇది యాదృచ్ఛికం. కొన్ని గంటల వ్యవధిలో, తొలుత కిష్త్వార్ ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్జ శీతల్ ప్రపంచ అథ్లెట్స్​ ఛాంపియన్‌లో గోల్డ్ మెడల్ నెగ్గింది. ఆ తర్వాత భదేర్వాకు చెందిన మిథున్ అత్యున్నత స్థానం దక్కించుకున్నారు” అని జితేంద్ర ఎక్స్​లో రాసుకొచ్చారు.

కెరీర్ ప్రారంభంలో మన్హాస్ రంజీల్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 9714 పరుగులు చేశారు. ఇందులో 27 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత ఐపీఎల్​లో 55 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగారు. ఆనంతరం డిల్లీ డేర్​డెవిల్స్, పూణె వారియర్స్ ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్​గా పనిచేశారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో పనిచేస్తున్నారు. డొమెస్టిక్​లో కొంత క్రికెట్ ఆడిన మిథున్, అంతర్జాతీయ క్రికెట్​లో మాత్రం అరంగేట్రం చేయలేదు.

కాగా, భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్, మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా జాతీయ సెలెక్టర్లుగా ఎంపికయ్యారు. సెలక్షన్ కమిటీలో ఈ ఇద్దరు సుబ్రతో బెనర్జీ, ఎస్ శరత్ స్థానాలను భర్తీ చేయనున్నారు. అలాగే కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన జయేష్ జార్జ్ ఇకపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మహిళల సీనియర్ సెలక్షన్ కమిటీకి కొత్త చీఫ్ సెలెక్టర్‌గా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అమిత శర్మ ఎంపికైంది. ఆమె మహిళల క్రికెట్​లో 5 టెస్ట్ మ్యాచ్‌లు, 116 వన్డేల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్య వహించింది. భారత మాజీ క్రీడాకారిణి సులక్షణ నాయక్, స్రవంతి నాయుడును కూడా మహిళా సీనియర్ సెలక్షన్ కమిటీలో చేర్చారు.