బీఎస్ఎన్ఎల్ స్వ‌దేశీ 4జీ నెట్వ‌ర్క్ ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

బీఎస్ఎన్ఎల్ స్వ‌దేశీ 4జీ నెట్వ‌ర్క్ ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ
బీఎస్ఎన్ఎల్‌కు చెందిన స్వ‌దేశీ 4జీ నెట్వ‌ర్క్‌ను ప్ర‌ధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన టెలికాం ప‌రిక‌రాల‌తో 4జీ సేవ‌ల‌ను అందించ‌నున్నారు. బీఎస్ఎన్ఎల్ సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాల నేప‌థ్యంలో మోదీ స్వ‌దేశీ 4జీ సేవ‌ల్ని ప్రారంభించారు.  భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్‌క చెందిన 97,500 మొబైల్ 4జీ ట‌వ‌ర్ల‌ను ఆయ‌న ప్రారంభించారు. దీంట్లో 92,600 4జీ టెక్నాల‌జీ సైట్లు ఉన్నాయి. 
బీఎస్ఎన్ఎల్ స్వ‌దేశీ 4జీతో స్వ‌దేశీ స్పూర్తి బ‌లోపేతం అవుతుంద‌ని మోదీ తెలిపారు. 92 వేల సైట్ల ద్వారా సుమారు 22 మిలియ‌న్ల భార‌తీయుల్ని క‌నెక్ట్ కానున్నారు.  దేశీయ టెలికాం రంగంలో ఇది కీల‌క‌మైన మైలురాయి కానున్న‌ది. ఒడిశాలోని జార్సుగూడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ బీఎస్ఎన్ఎల్ 4జీ ట‌వ‌ర్ల‌ను ఓపెన్ చేశారు. ఒడిశా, ఏపీ, యూపీ, మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, అస్సాం, గుజ‌రాత్, బీహార్ రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ ట‌వ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.
ఒడిశాలో సుమారు రూ. 60 వేల కోట్ల‌కు చెందిన అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. స్వదేశీ సాంకేతికతతో 4జీ సేవలను ప్రారంభించిన ప్రపంచంలోని ఐదు దేశాల్లో భారత్​ ఒకటిగా నిలిచిందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. బీఎస్​ఎన్​ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్ ప్రారంభించడం దేశానికే గర్వకారణమని తెలిపారు. భారత్‌ అభివృద్ధిని సూచిస్తున్నాయని పేర్కొంటూ స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల దేశంలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. 
 
భారతదేశ స్వయంసమృద్ధి సాధనకు తమ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌ దార్శనికతతో దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని చెప్పారు.  దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ఐఐటీల విస్తరణకు ప్రధాని శంకుస్థాపన చేశారు. స్వదేశీ సాంకేతికతతో రూ.రూ.37,000 కోట్ల వ్యయంతో నిర్మించిన 97,500 పైగా 4జీ టవర్లను మోదీ ప్రారంభించారు. 
దీంతో టెలికాం పరికరాల ఉత్పత్తి, తయారీలో భారత్‌ డెన్మార్క్‌, స్వీడన్‌, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల సరసన చేరింది.
అలాగే గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాను ఉద్నాతో కలిపే అమృత్‌ భారత్‌ రైలుకు ఆయన జెండా ఊపారు. రూ.1400 కోట్ల వ్యయంతో నిర్మించిన కోరాపుట్‌-బైగూడ రైలు మార్గాన్ని, 82 కిలోమీటర్ల మనబార్‌, కోరాపుట్‌, గోరాపుర్‌ సెక్షన్‌ను ప్రధాని జాతికి అంకితమిచ్చారు.
 
“భారత్​ ప్రతిదానిలోనూ స్వావలంబన సాధించాలనేది మా లక్ష్యం. చిప్ నుంచి షిప్ వరకు అన్ని రంగాలలో భారత్ స్వదేశీగా తయారు కావాలి అనేది మా సంకల్పం. ఇందులో భాగంగా, ఒడిశాలో రెండు సెమీకండక్టర్ యూనిట్లను ఆమోదించాం. అమృత్ భారత్ రైలు గుజరాత్‌లోని ఒడియా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కళలు, సంస్కృతిపై ఒడిశా ప్రజలు చూపించే ప్రేమ, ఆప్యాయత ప్రపంచ ప్రసిద్ధి చెందినది” అని ప్రధాని మోదీ వెల్లడించారు.