
రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని వినియోగించి తాజాగా తెలంగాణ సర్కారు బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు ఆ దిశగా రిజర్వేషన్ల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం పరిమితిని ప్రభుత్వం తొలగించింది.
బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ, వారి భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంది. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఆ గడువును క్రమంగా పాటిస్తూ బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జీవో విడుదల చేయడం విశేషం.
సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ను అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు బీసీలకు 23% రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కులగణన నిర్వహించి బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్లో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల) నిర్వహించింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటుచేసింది. ఇంటింటి సర్వే గణాంకాలను అధ్యయనం చేసిన సదరు కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
బూసాని కమిషన్ నివేదిక ఆధారంగా విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ను 42 శాతానికి పెంచేందుకు మార్చిలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆయా బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపగా అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత ఆగస్టులోనే మరోసారి అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసింది.
More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
హైదరాబాద్ శివార్లల్లో గోసంరక్షకులపై కాల్పులు:
ఫీజు బకాయిలు చెల్లించకపోతే సచివాలయం ముట్టడి!