
అమెరికాలో హెచ్-1బీ వీసా ఫీజులను భారీగా పెంచాలన్న ప్రతిపాదన అక్కడి టెక్ కంపెనీలను ఆందోళనకు గురిచేస్తుండగా, అదే సమయంలో ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన భారతీయ టెక్కీలకు ఇది ఊహించని వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఉద్యోగి కోసం లక్ష డాలర్ల వరకు ఫీజు చెల్లించే బదులు, ఇప్పటికే వీసా కలిగి ఉండి ఉద్యోగం కోల్పోయిన పాత నిపుణులను తిరిగి నియమించుకోవడం వైపే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాక, వ్యయ నియంత్రణ చర్యల కారణంగా ఒరాకిల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు గత కొంతకాలంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. గణాంకాల ప్రకారం, 2024లో 2,38,461 మంది, 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 1,44,926 మంది టెక్ ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయారు.
వీరిలో చాలామంది హెచ్-1బీ వీసా కలిగినవారే. నిబంధనల ప్రకారం, వీరు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం సంపాదించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా వీసా స్పాన్సర్ చేసే ఖర్చుతో పోలిస్తే, ఇప్పటికే అమెరికాలో ఉన్న వీసా హోల్డర్లను నియమించుకోవడం కంపెనీలకు ఈజీ. వీరికి మళ్లీ లాటరీతో పని లేకుండా, సాధారణ ట్రాన్స్ఫర్ పిటిషన్తో సులువుగా ఉద్యోగంలోకి తీసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన వారికి త్వరలోనే కంపెనీల నుంచి తిరిగి ఉద్యోగ ఆఫర్ వచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఇమిగ్రేషన్ న్యాయ సంస్థ ‘చగ్ ఎల్ఎల్సీ’ న్యాయవాది నవనీత్ ఎస్ చగ్ తెలిపారు.
మరోవైపు, ఈ పరిణామాల నేపథ్యంలో సిటీగ్రూప్, గోల్డ్మ్యాన్ శాక్స్ వంటి అమెరికన్ బ్యాంకులు తమ కార్యకలాపాల కోసం భారత్లో ఉన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)పై మరింతగా ఆధారపడటానికి సిద్ధమవుతున్నాయని బ్లూమ్బెర్గ్ నివేదిక వెల్లడించింది. దీంతో అమెరికాలోని నియామకాల భారాన్ని తగ్గించుకుంటూ, భారత కేంద్రాల ద్వారా తమ పనులను కొనసాగించే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి.
More Stories
జనరల్ రైలు టికెట్కు ఆధార్ తప్పనిసరి
విదేశీ సినిమాలపై ట్రంప్ 100 శాతం సుంకాలు
సెలబ్రిటీల రూ.కోట్ల విలువైన ఆస్తులను జప్తుకు సన్నాహాలు!