ఆసియా కప్ బాయ్‌కాట్ అంటూ బెట్టు చేసి తోకముడిచిన పాక్

ఆసియా కప్ బాయ్‌కాట్ అంటూ బెట్టు చేసి తోకముడిచిన పాక్

ఆసియా క‌ప్‌లో భాగంగా పాక్తిస్తాన్‌-యూఏఈ మ‌ధ్య మ్యాచ్ బుధవారం గంట ఆలస్యంగా మొదలైంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బహిష్కరణ డ్రామా నేప‌థ్యంలో మ్యాచ్ ఆల‌స్య‌మైంది. భారత ప్లేయర్లు తమకు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకపోవడానికి మ్యాచ్‌ రిఫరీ అండీ పైక్రాఫ్ట్‌ కారణమంటూ పీసీబీ చిందులు తొక్కింది.  షేక్‌హ్యాండ్‌ వివాదానికి రిఫరీ పైక్రాఫ్ట్‌ ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఐసీసీకి పీసీబీ మరో లేఖాస్త్రం సంధించింది. ఈ విషయంలో పైక్రాఫ్ట్‌ క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొంటూ పీసీబీ లేఖ రాసింది.

అయితే,  ఐసీసీ రిఫ‌రీని మార్చే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేయడంతో, తాము ఆడబోమంటూ మ‌రోసారి పీసీబీ బెట్టు చేసింది.  ఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఇందులో రిఫరీ పైక్రాఫ్ట్‌ది ఎలాంటి తప్పిదం లేదని, నిబంధనల ప్రకారమే అతను వ్యవహరించాడని ఐసీసీ కరాఖండిగా చెప్పడంతో పాటు ఒకవేళ టోర్నీ నుంచి తప్పుకుంటే 16 యూఎస్‌ మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ కోల్పోవాల్సి వస్తుందని పీసీబీకి స్పష్టం చేసింది. 

దీంతో మల్లాగుల్లాలు పడ్డ పీసీబీ మాజీ చైర్మన్లు రమీజ్‌రాజా, నజామ్‌ సేథీతో మాట్లాడి ఆడేందుకు మొగ్గుచూపింది.  వాస్తవానికి మ్యాచ్ ప్రారంభానికి కనీసం గంట ముందు ఆటగాళ్లు స్టేడియానికి రావాల్సి ఉంటుంది. కానీ పాక్ ఆటగాళ్లు  హోటల్‌ గదులకే ఎక్కువసేపు పరిమితమయ్యారు. పీసీబీ ఆదేశాల మేరకు వారంతో తమ తమ గదుల్లోనే ఉండిపోయారు. 

దీంతో పాక్, యూఏఈ మ్యాచ్ జరగదనే ప్రచారం జరిగింది. ఈ మేరకు పాకిస్థాన్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి.  ఓ పక్క మ్యాచ్‌కు సమయం ఆసన్నమవుతుండగా యూఏఈ టీమ్ మాత్రం షెడ్యూల్ ప్రకారం దుబాయ్ స్టేడియానికి చేరుకుంది. అటు పాకిస్థాన్ ఆటగాళ్లు కిట్‌లు వచ్చినా ఆటగాళ్లు మాత్రం రాలేదు. 

మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఈ మ్యాచ్‌ నుంచి తప్పిస్తేగానీ తాము మ్యాచ్ ఆడబోమని పాక్ చెప్పినట్లు ప్రచారం జరిగింది.  కానీ ఐసీసీ మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోలేదు. చివరకు సుమారు రాత్రి 7 గంటల సమయంలో పీసీబీ మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం కోరింది  మ్యాచ్‌ను బ‌హిష్క‌రిస్తే పాక్ బోర్డు  దాదాపు 16 మిలియ‌న్ డాల‌ర్ల ఆదాయాన్ని కోల్పోవడంతో  పాటు క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాగాల పరిణామాల దృష్ట్యా పిసిబి మెట్టు దిగి ఆటలో పాల్గొనాల్సి వచ్చింది. .

పీసీబీ నుంచి ప్రకటన వచ్చిన కాసేపటికే పాక్ ఆటగాళ్లు హోటల్ గదుల నుంచి స్టేడియానికి బయలుదేరారు. ఎట్టకేలకు స్టేడియానికి చేరుకున్నారు.  షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.30కి టాస్ పడాల్సి ఉండగా పీసీబీ అభ్యర్థన మేరకు గంటల ఆలస్యంగా రాత్రి 8.30కి టాస్ పడింది. ఈ మ్యాచ్‌లో యూఏఈపై 41 పరుగుల తేడాతో గెలుపొంది పాకిస్థాన్ సూపర్‌-4కు అర్హత సాధించింది.