
* బ్యాంకుల ఆర్ధిక సహాయం, వడ్డీలపై మారటోరియంతో ఆదుకోవాలని సీఎం చంద్రబాబు వినతి
అమెరిగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల కారణంగా ఆంధ్రప్రదేశ్కు రొయ్యల ఎగుమతి నష్టాలు దాదాపు రూ.25,000 కోట్లుగా అంచనా వేయగా, దాదాపు 50 శాతం ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యాయి. ఎగుమతి అవుతున్న దాదాపు 2,000 కంటైనర్లపై దాదాపు రూ.600 కోట్ల సుంకాల భారం పడిందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. అమెరికా విధించిన సుంకాల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్సింగ్లకు ఆదివారం విడివిడిగా లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సహాయం కూడా ఆక్వా రైతులను ఆదుకునేందుకు అవసరమవుతుందని, ఈ సమస్యల పరిష్కారం కోసం ఎగుమతిదారులకు ఆక్వా కంపెనీల బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం, వడ్డీ చెల్లింపులపై 240 రోజులపాటు మారటోరియం విధించాలని సిఎం కోరారు.
వడ్డీ రాయితీ కల్పించడంతోపాటు ప్రొజెన్ రొయ్యలపై ఉన్న 5 శాతం జిఎస్టిని తాత్కాలికంగా మినహాయించడం వంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ చర్యలతో అమెరికా కాకుండా ఇతర దేశాలకు ఆక్వా మార్కెట్ను విస్తరించే అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. యూరోపియన్ యూనియన్, దక్షిణ కొరియా, సౌదీ, రష్యా దేశాల్లో ఆక్వా ఎగుమతులు పెరిగేలా ఆయా దేశాలతో ఫ్రీటెడ్ ఒప్పందాలు కుదుర్చుకునే అంశాలను పరిశీలించాలని ప్రస్తావించారు.
ఎగుమతిదారులకు మధ్యంతర ఆర్థికసాయం, ఎగుమతులపై విధించే సుంకాలు, పన్నుల ఉపశమనం పథకంపై మరింత స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. యూరోపియన్ యూనియన్ దేశాలకు సీ ఫుడ్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎగుమతిదారులు తనకు విజ్ఞప్తి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశీయంగా ఆక్వా మార్కెటింగ్ పెంచుకోవడానికి అవసమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ కేటాయించాలని కోరారు.
కోల్డ్ స్టోరేజీలు, హైజినిక్ ఫిష్, సీ ఫుడ్ మార్కెట్లు ఏర్పాటు చేయాలని, రైతుల నుంచి నేరుగా ఆక్వా ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేలా ఎపి రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సిఎం లేఖలో పేర్కొన్నారు. ఆక్వా ఉత్పత్తుల్లో మంచి ప్రొటీన్ ఉంటుందని, ఇది మంచి బలవర్ధకమైన ఆహారమనే విషయాన్ని అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇందుకోసం ఎన్ఎఫ్డిబి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన కుదుర్చుకోవాలని సూచించారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మత్స్యకారులకు రూ.1 లక్ష వరకు వన్టైమ్ టాప్ అప్ రుణాలివ్వాలని కోరారు. ఐకార్-సిఐబిఎ, ఐకార్-ఎన్బిఎఫ్జిఆర్ వంటి సంస్థల ప్రాంతీయ కార్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటుచేయాలన్నారు. జాతీయ స్థాయిలో జరిగే రొయ్యల ఎరువుల్లో రాష్ట్రం నుంచి 80 శాతం వాటా ఉందని, సముద్రం ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వాటా రాష్ట్రం కలిగి ఉందని పేర్కొన్నారు.
More Stories
చరిత్రలో తెలంగాణ విమోచనకు అత్యంత ప్రాముఖ్యత
రాజకీయాల్లో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం
అమెరికా చెప్పినట్లు టారిఫ్ విధిస్తే ప్రతిచర్యలు