ఐశ్వ‌ర్య ఫొటోలు వాడితే క‌ఠిన చ‌ర్య‌లు

ఐశ్వ‌ర్య ఫొటోలు వాడితే క‌ఠిన చ‌ర్య‌లు
ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్  బచ్చన్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన ఫొటోలు, పేరును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఇకపై ఐశ్వర్య అనుమతి లేకుండా ఆమె చిత్రాలను గానీ, వ్యక్తిగత హక్కులను గానీ దుర్వినియోగం చేయరాదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అనధికారికంగా ఐశ్వర్య ఫొటోలను వాణిజ్య ప్రకటనలకు వాడటం వల్ల ఆమెకు ఆర్థికంగా నష్టం కలగడమే కాకుండా, ఆమె ప్రతిష్ఠ, గౌరవం దెబ్బతింటున్నాయని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. ఇది ఆమె వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడమే అని తేల్చి చెప్పింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న పలు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు,గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. 

పిటిషన్‌లో పేర్కొన్న అన్ని వివాదాస్పద యూఆర్‌ఎల్‌లను వెంటనే తొలగించి, బ్లాక్ చేయాలని ఆదేశించింది. నోటీసులు అందుకున్న 72 గంటల్లోగా యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేసి, ఏడు రోజుల్లోగా ఈ ఆదేశాలను పూర్తిగా అమలు చేయాలని కేంద్ర ఐటీ, సమాచార శాఖకు కోర్టు సూచనలు ఇచ్చింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో ఈ తీర్పు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను 2026 జనవరి 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ తీర్పుతో ఆన్‌లైన్ వేదికలు ప్రముఖుల హక్కులను గౌరవించాల్సిన ఆవశ్యకత మరోసారి స్పష్టమైంది.