
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ ప్రారంభంలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తమ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును బిఆర్ఎస్ ప్రకటించింది. ఆమె దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు ఈ విషయం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో గోపీనాథ్ భార్య సునీతతో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటిస్తున్నామని తెలిపారు. ఆమెకు అందరి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నానని అని భరోసా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ బైఎలక్షన్లో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించడమే గోపీనాథ్కు ఇచ్చే సరైన నివాళి అని స్పష్టం చేశారు.
ఈ ఉప ఎన్నికలో ఒక్కో ఓటుకు రూ.5 వేలు పంచితే తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. అలానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా పెద్దల జోలికి వెళ్లదని, అందుకే సీఎం సోదరుడు చెరువుని ఆక్రమించి ఇల్లు నిర్మించినా పట్టించుకోలేదని, కానీ పేదల బస్తీలకు వెళ్లి వారి ఇళ్లు కూలగొడతుందని కేటీఆర్ విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో సర్వేలు నిర్వహించామని, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చాలా బాగున్నట్లని తెలుస్తోందని కేటీఆర్ భరోసా వ్యక్తం చేశారు. కొన్ని బస్తీల్లో వెనకబడి ఉన్నామని, అందరం కలిసి కట్టుగా పని చేస్తే పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నాయకులంతా కలిసికట్టుగా పని చేసి పార్టీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. అలానే ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను తొలగించి, లేని వారి పేర్లు చేర్చాలని సూచించారు.
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సత్తా చాటాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మాగంటి సునీత మాట్లాడుతూ తన భర్త మాగంటి గోపీనాథ్లాగే.. తనకు కూడా కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. గోపీనాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు.