ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్ మధ్య విబేధాలు అంటూ పాక్ దుష్ప్రచారం!

ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్ మధ్య విబేధాలు అంటూ పాక్ దుష్ప్రచారం!

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పెద్దఎత్తున ఫేక్‌ ప్రచారానికి తెరలేపిన దాయాది పాకిస్థాన్‌ దాన్ని ఇంకా కొనసాగిస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని అనుకూల ఎక్స్‌ హ్యాండిళ్ల నుంచి ఒకేతరహా ప్రచారం చేయిస్తోంది. తాజాగా భారత్పై మరో దుష్ప్రచారం చేయగా, పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ దీనిని సమర్థంగా తిప్పికొట్టింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదిల మధ్య సంబంధాలు చెడిపోయాయంటూ ఓ కల్పిత ప్రచారానికి పాకిస్థాన్ తెరతీసింది. యుద్ధ సామగ్రిని అప్‌గ్రేడ్‌ చేయకుండా పాక్‌తో వివాదం పెట్టుకోవడం భారత సైన్యానికి ఏమాత్రం ఇష్టం లేదని ఆ పోస్టుల్లో పేర్కొంది. ఇలా ఒకేతరహా సందేశం వేర్వేరు అకౌంట్ల నుంచి రావడంతో పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం అప్రమత్తం అయ్యింది. 

ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలంటూ పౌరులకు సూచించింది. అంతకుముందు కూడా ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ ఫేక్ న్యూస్ ప్రసారానికి తెరలేపింది. అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థను పాక్ కూల్చేసినట్లు ప్రచారం చేసుకుంది. 

భారత్‌ అమ్ముల పొదిలో అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400ను పాక్‌కు చెందిన జేఎఫ్‌-17 యుద్ధ విమానం ఓ క్షిపణితో కూల్చేసిందని పాక్‌ ప్రభుత్వ రంగ మీడియా సంస్థ పీటీవీలో కథనాలు వెలువడ్డాయి. ఈ దాడి పంజాబ్‌లోని ఆదంపుర్‌ వద్ద జరిగినట్లు రాసుకుంది. అయితే, వాటిని ఖండిస్తూ వెంటనే భారత మిలిటరీ విభాగం స్పందించింది. 

హైపర్‌ సోనిక్‌ క్షిపణితో ఎస్‌-400ను ధ్వంసం చేసినట్లు పాక్‌ చేస్తున్న ప్రచారం నకలీ వార్తలు అని భారత సైనికాధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా భారత వాయుసేన మహిళా పైలెట్ పాక్ బలగాలకు చిక్కరాని, పవర్గ్రిడ్ 70శాతం నిర్వీర్యమైపోయిందని నకిలీ వార్తలను ప్రచారం చేసింది. అయితే, భారత్ వాటిని ఫ్యాక్ట్ చెక్లతో తిప్పికొడుతోంది. దీంతో సోషల్‌ మీడియా వినియోగదారులు ఇలాంటి పాక్‌ తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని పీఐబీ సూచించింది.