
పాకిస్థాన్ లో కూడా వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ముఖ్యంగా కరాచీ నగరంలో హిందూ సమాజం నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఊరేగింపు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది.గణేశ్ నవరాత్రులు ముగిసిన సందర్భంగా, స్థానిక హిందువులు విగ్రహ నిమజ్జనానికి సిద్ధమయ్యారు.
ఒక పెద్ద వినాయకుడి విగ్రహాన్ని ఆటోలో ఉంచి శోభాయాత్రగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు డోలు చప్పుళ్లకు నృత్యాలు చేస్తూ “గణపతి బప్పా మోరియా” అంటూ నినదించారు. రోడ్డుపై వెళ్తున్న సాధారణ పాకిస్థానీలు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా గమనించారు. చాలామంది ఆగి ఉత్సవాన్ని ఆసక్తిగా వీక్షించారు. ఈ అరుదైన క్షణాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్దిసేపట్లోనే వీడియో వైరల్గా మారింది.
కేవలం మూడు రోజుల్లోనే ఈ వీడియోకు కోట్లలో వ్యూస్ వచ్చాయి. 14 లక్షలకు పైగా లైకులు సాధించింది. నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.వీడియో చూసిన ఒకరు “అన్ని మతాలను గౌరవించడం నిజమైన మానవత్వం” అని రాశారు. మరోకరు “పాకిస్థాన్లో ఇలాంటి వేడుక జరపడం ధైర్యం కావాలి” అని వ్యాఖ్యానించారు. మరికొందరు “పాకిస్థాన్లో వినాయక విగ్రహం ఎలా దొరికిందో ఆశ్చర్యం” అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఈ వీడియో చుట్టూ జరుగుతున్న చర్చలు పాకిస్థాన్లో హిందువుల ఉనికి, వారి ఆచారాలపై దృష్టిని మళ్లిస్తున్నాయి.
ఈ ఘటన పాకిస్థాన్లో హిందూ సమాజం ధైర్యానికి ఉదాహరణగా నిలిచింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారని ఇది స్పష్టం చేస్తోంది. వినాయక చవితి ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాక, సమాజంలో ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. కరాచీ వీధుల్లో జరిగిన ఈ శోభాయాత్ర ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది. మత భేదాలు ఉన్నా, మనుషుల మధ్య అనురాగం, గౌరవం పెంచడమే నిజమైన సందేశమని ఈ సంఘటన స్పష్టం చేసింది. వినాయక చవితి సంబరాలు పాకిస్థాన్లోనూ ఐక్యతను చాటుతూ విశేషంగా నిలిచాయి.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్లకు భారత్ హెచ్చరిక