ఐపీఎల్‌ టికెట్లపై 40శాతం జీఎస్టీ ..కార్లు, రియల్ ఎస్టేట్‌లకు బూస్టే !

ఐపీఎల్‌ టికెట్లపై 40శాతం జీఎస్టీ ..కార్లు, రియల్ ఎస్టేట్‌లకు బూస్టే !
జీఎస్టీ సంస్కరణలతో దేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన క్రికెట్‌పై భారీగా ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై ఏకంగా 40శాతం పన్ను విధించాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. దాంతో టికెట్‌ ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. అయితే, 40శాతం రేటు ఐపీఎల్‌ వంటి ఈవెంట్లకు మాత్రమే వర్తించనున్నది. 

మరోవైపు, గుర్తింపు పొందిన స్పోర్ట్స్‌ ఈవెంట్‌లపై ఈ భారీ పన్ను విధించే అవకాశం లేదు. గుర్తింపు పొందిన స్పోర్ట్స్‌ ఈవెంట్‌కు టికెట్ రూ.500 వరకు ఉంటే.. గతంలో మాదిరిగానే జీఎస్టీ ఉండదు. రూ.500 కంటే ఎక్కువ ధర ఉన్న టిక్కెట్లపై 18 శాతం చొప్పున జీఎస్టీ కొనసాగుతుంది. అంటే, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడా టోర్నమెంట్ల ప్రేక్షకులపై ఎటువంటి అదనపు భారం ఉండదన్న మాట.

బెట్టింగ్, జూదం, లాటరీ, గుర్రపు పందెం, ఆన్‌లైన్ మనీ గేమింగ్ వంటి కార్యకలాపాలను 40 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ రంగాల వ్యాపారాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరనున్నది.కాగా, ఇది రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊరటనివ్వనుంది. సిమెంట్ , స్టీల్ వంటి కీలక నిర్మాణ సామగ్రి పై జీఎస్టీని 28% నుంచి 18%కు తగ్గించడం ద్వారా నిర్మాణ వ్యయాలు తగ్గనున్నాయి.

దీంతో రియల్ ఎస్టేట్ సెక్టర్‌కు దాదాపు 10-15% వరకు లాభం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సెక్టర్‌లో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులకు జీఎస్టీ రేటు 1%గా, రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు 5%గా (ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా) కొనసాగుతుంది. అయితే, లగ్జరీ హోమ్స్ పై 40% స్లాబ్ ప్రతిపాదన ఉంది. ఇది లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్‌కు ఇబ్బందికరమే. డెవలపర్లు ఆ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తారు. అందుకే లగ్జరీ ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

నిర్మాణ సామగ్రి పై జీఎస్టీ తగ్గింపు డెవలపర్లకు లాభమార్జిన్‌లను పెంచుతుంది. అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రేట్ కట్ రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను పెంచుతుంది , హౌసింగ్ అఫర్డబిలిటీని మెరుగుపరుస్తుందని మార్కెట్ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. నిర్మాణ వ్యయాలు తగ్గడం వల్ల కొత్త ప్రాజెక్టులు పెరుగుతాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో రియల్ డిమాండ్ పెరగడానికి అవకాశం ఉందని భావిస్తున్నారు.

జీఎస్టీ రేషనలైజేషన్ రియల్ ఎస్టేట్ సెక్టర్‌కు దీర్ఘకాలిక లాభాలు చేకూరుస్తుంది. రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ మార్పులను ‘గేమ్ చేంజర్’గా అభివర్ణిస్తున్నారు. ఎంత మేర రియల్ బూమ్ ఊపందుకుంటుందో అమల్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. జీఎస్టీ  శ్లాబుల మార్పులతో చిన్నకార్లకు డిమాండ్‌ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లపై పన్ను భారం 10 శాతం తగ్గనుంది. వీటితోపాటు రోజువారీ వాడుకొనే చిన్న బైకులకు రిలీఫ్‌ లభించింది.

బొగ్గుపై వస్తు, సేవల పన్ను భారం త్వరలో ఏకంగా 13 శాతం పెరుగుతున్నది. ప్రస్తుతం 5 శాతం శ్రేణిలో ఉన్న బొగ్గుపై కొత్త విధానంలో 18 శాతం జీఎస్టీ రేటు పడుతుంది. ఎస్టీ భారం అమాంతం దాదాపు మూడు రెట్లు పెరిగితే థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఒత్తిడికి గురవుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతిమంగా ఆ భారం విద్యుత్ వినియోగదారులపైనే పడే అవకాశం ఉంది.