
తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సమర్థించింది. తెలంగాణలో వరుసగా 9 ,10, 11,12 తరగతులు చదివితేనే లోకల్ అంటూ స్పష్టం చేసింది. అయితే ఈ రూల్స్లో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రం మినహాయింపు ఉంటుందనే షరతు సుప్రీంకోర్టు పెట్టింది.
లోకల్ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ల అంశంపై వివాదాస్పదంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 33 ప్రకారం ఇంటర్మీడియట్కు ముందు వరుసగా నాలుగేళ్లు (9,10, ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం) చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణించాలని స్పష్టం చేసింది.
కానీ, కొందరు విద్యార్థులు దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా, ఆ జీవోను కొట్టివేయగా, తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రతి రాష్ట్రం తన స్థానిక రిజర్వేషన్ల కోసం తగిన నిబంధనలు రూపొందించుకునే అధికారం ఉందని తమకు ఉందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించింది.
అయితే రాష్ట్ర విభజన తర్వాత తమ పిల్లలు వేరే రాష్ట్రంలో (ఏపిలో) చదవాల్సి వచ్చిందని, కావున వారిని కూడా స్థానికులుగా పరిగణించాలని మెడికల్ కోర్స్లకు దరఖాస్తు చేసుకున్న అభ్య ర్థుల తరపున పిటిషనర్లు వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో లోకల్ కోటా పై జీవో 33 ను అమలు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది.
రాష్ట్ర ప్రభుత్వ వాదనలపై జస్టిస్ గవాయ్ పలు ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో పుట్టిన, పదో తరగతి వరకు చదివిన, తల్లిదండ్రులు ఇక్కడే శాశ్వత నివాసం ఉన్న విద్యార్థి వేరే రాష్ట్రాల్లో ఇంటర్ చదివారన్న కారణంతో వారి ప్రవేశాలను నిరాకరించవచ్ఛా? జెఇఇ, నీట్ శిక్షణ నిమిత్తం రాజస్థాన్లోని కోటాకు దేశం నలుమూలల నుంచీ విద్యార్థులు వెళ్తుంటారు కదా? అలా వెళ్లిన వారి పరిస్థితి ఏంటి? న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారి డిప్యుటేషన్పై ఢిల్లీ వెళ్తే, అప్పుడు ఆయన కుమారుడు డిల్లీలో ఇంటర్ చదివాడని పక్కన పెడతారా? స్థానికత నిబంధన గురించి తెలియని విద్యార్థులు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళితే అక్కడా, ఇక్కడా స్థానికులు కాకుండా పోయే ప్రమాదం ఉంది కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు తప్పని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్నారని, దాంతో వారి పిల్లల కు ఈ జీవో 33 నుంచి మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అయితే గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక మినహాయింపుతో స్థానిక కోటా కింద ప్రయోజనం పొందిన విద్యార్థులు తమ ప్రయోజనాలను కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇక నుంచి ఎంబిబిఎస్, బిడిఎస్ యూజి కోర్సులలో జీవో 33 ప్రకారమే స్థానిక కోటా రిజర్వేషన్లు అమలు కానున్నాయి.
అయితే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే జీవో 33 నుంచి మినహాయింపు ఇవ్వడం పట్ల ప్రైవేటు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా తప్పని పరిస్థితు ల్లోనే రాష్ట్రాన్ని వదిలి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయాల్సి వస్తుందని తమ పిల్లల భవిష్యత్ గురించి ప్రభుత్వం, కోర్టులు ఆలోచించాలని కోరుతున్నారు.
More Stories
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం
ఆసియాకప్లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి