కోర్టులలో పెండింగ్ లో 72,02 సిబిఐ చేపట్టిన అవినీతి కేసులు

కోర్టులలో పెండింగ్ లో 72,02 సిబిఐ చేపట్టిన అవినీతి కేసులు

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) దర్యాప్తు చేసిన 7,072 అవినీతి కేసులు వివిధ కోర్టులలో విచారణ పెండింగ్‌లో ఉన్నాయని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సివిసి) తెలిపింది. వాటిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా విచారణలో ఉన్నాయని ఆదివారం విడుదలైన తాజా వార్షిక నివేదిక పేర్కొంది.  2024, డిసెంబర్‌ 31 నాటికి మొత్తం కేసుల్లో 1,506 కేసులు మూడేళ్ల లోపు, 791 కేసులు మూడేళ్ల నుండి ఐదేళ్ల వరకు, 2,115 కేసులు ఐదేళ్ల నుండి 10 ఏళ్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.

అవినీతి నిరోధక సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 2,281 కేసులు 10 ఏళ్లకు పైగా,   379 కేసులు 20 ఏళ్లకు పైగా విచారణలో ఉన్నాయని తెలిపింది. 2024 డిసెంబర్‌ 31 నాటికి 7,072 కేసులు విచారణ కోసం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. వాటిలో 2,660 కేసులు 10 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉండటం ఆందోళన కలిగించే విషయమని సివిసి పేర్కొంది.

నివేదిక ప్రకారం సీబీఐ, నిందితులు దాఖలు చేసిన 13,100 అప్పీళ్ళు/సవరణలు వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని సివిసి తెలిపింది.  వీటిలో 606 అప్పీళ్లు/ సవరణలు 20 సంవత్సరాలకు పైగా, 1,227 అప్పీళ్లు/సవరణలు 15 ఏళ్లకు పైగా 20 ఏళ్ల కంటే తక్కువ కాలం, 2,989 10 సంవత్సరాల కంటే తక్కువ కాలం, 4,059 ఐదేళ్ల కంటే ఎక్కువ 10 ఏళ్ల కంటే తక్కువ కాలం, 1,778 రెండేళ్ల కంటే ఎక్కువ ఐదేళ్ల కంటే తక్కువ కాలం,  2,441 రెండేళ్ల కంటే తక్కువ కాలం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.