బ్రిక్స్ దేశాలపై వివక్షాపూరిత ఆంక్షలను విధిస్తే ప్రతిఘటిస్తాం

బ్రిక్స్ దేశాలపై వివక్షాపూరిత ఆంక్షలను విధిస్తే ప్రతిఘటిస్తాం
బ్రిక్స్ దేశాల సామాజిక, ఆర్థిక వికాసాన్ని అడ్డుకునేందుకు ఎవరైనా వివక్షాపూరిత ఆంక్షలను విధించినా ప్రతిఘటిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఆయన  ఇలాంటి అంశాలలో అంతర్జాతీయ సమాజంలోని ఏ దేశానికైనా తమ మద్దతు ఉంటుందని పుతిన్ స్పష్టం చేశారు. బ్రిక్స్ కూటమి బలోపేతానికి చైనా, రష్యా కలిసికట్టుగా పనిచేస్తాయని ఆయన వెల్లడించారు.

“బ్రిక్స్ కూటమిని అంతర్జాతీయ సమాజంలో బలమైన స్తంభంగా మార్చేందుకు చైనా, రష్యా కలిసి పనిచేస్తాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలకూ బ్రిక్స్ మద్దతుగా నిలుస్తుంది. ఈ సంస్థల్లో వాస్తవిక సమానత్వం, అన్ని దేశాలకూ సమాన లబ్ధి అనే సూత్రాల ప్రాతిపదికన నూతన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి మేం పిలుపునిస్తున్నాం” అని ప్రకటించారు.

“అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రుణ సాధనాలను నయా వలసవాదం కోసం కొన్ని దేశాలు వాడుకోవడం సరికాదు. ప్రపంచంలోని మెజారిటీ దేశాలకు ఆర్థిక ఫలాలు అందాలని బ్రిక్స్ కోరుకుంటోంది. బ్రిక్స్ సభ్యదేశాలకు ఆర్థిక అవకాశాలను పెంచడంపై మేం దృష్టి సారిస్తాం. వ్యూహాత్మక రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యం కోసం ఉమ్మడి వేదికలను సిద్ధం చేస్తాం. బ్రిక్స్ సామర్థ్యాన్ని మరింత పెంచుతాం” అని ఓ ఇంటర్వ్యూలో పుతిన్ వెల్లడించారు.

“జీ20 కూటమిలో చైనా పోషిస్తున్న పాత్ర చాలా గొప్పది. రష్యా, చైనా భావసారూప్య దేశాలు. మా రెండు దేశాలు కలిసి జీ20 కూటమి ప్రాధాన్యతల ఎజెండాలో గ్లోబల్ సౌత్‌ను చేర్పించాం. జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌ను చేర్చడాన్ని మేం స్వాగతిస్తున్నాం. బ్రిక్స్, ఇతర అంతర్జాతీయ కూటముల మధ్య భాగస్వామ్యాన్ని పెంచే దిశగా అదొక కీలక అడుగు” అని చెప్పారు.

జీ20 కూటమిలోని బ్రిక్స్ దేశాల సహకారాన్ని తీసుకొని, ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో చేర్చడంలో రష్యా, చైనాలు ముఖ్య పాత్ర పోషించాయని పుతిన్ తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సభ్యదేశాల ప్రభుత్వ అధినేతల 25వ సదస్సులో పాల్గొనేందుకు చైనాలోని తియాంజిన్​కు పుతిన్‌ చేరుకున్నారు.  ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 1 వరకు ఈ సదస్సు కొనసాగనుంది. ఈసందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ పుతిన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

నరేంద్రమోదీ శనివారం సాయంత్రమే చైనాలోని టియాన్‌జిన్‌కు చేరుకున్నారు. గత ఏడేళ్లలో ఆయన చైనా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.  ఆదివారం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, మయన్మార్ తాత్కాలిక అధ్యక్షుడు, మిలిటరీ చీఫ్ మిన్ ఆంగ్ హలైంగ్‌లతో మోదీ భేటీ కానున్నారు. 2026 సంవత్సరంలో బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఈసారి చైనాలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సు ప్రాధాన్యతను సంతరించుకుంది. 

ఈ సదస్సు వేదికగా పుతిన్, మోదీ, షి జిన్‌పింగ్‌ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం, బ్రిక్స్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ను బలోపేతం చేయడం, కొత్త పేమెంట్ వ్యవస్థలను తయారు చేయడం, బ్రిక్స్ దేశాల మధ్య ఇంధన వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చ జరగొచ్చు. అమెరికా ఒత్తిడిని తట్టుకొని నిలబడేలా బ్రిక్స్ దేశాలను బలోపేతం చేసేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించనున్నారు.